హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాలపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవేదనకు లోనయ్యారు. మహిళా సంక్షేమంపై మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఓ సమావేశానికి వెళ్లే ముందు.. ఒక్క నిమిషం మాట్లాడుతామని చెప్పి ఇద్దరు బాలికలు తన వద్దకు వచ్చారు. మేము అనాథ పిల్లలం.. కేజీబీవీలో చదువుతున్నాం. టెన్త్ అయిపోతుంది. తర్వాత మేం ఎక్కడికి పోతామో తెలుస్తలేదు అని ఆ పిల్లలు చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేరు. ఆదరించే బంధువులు లేరు. ఇది క్రూరమైన సమాజం.. ఎదిగిన ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలి. ఏం చేయాలి. ఆ రోజంతా నిద్ర పోలేదు.. బాగా ఏడ్సిన మనసులో అని కేసీఆర్ తెలిపారు.
నిజంగా మన బిడ్డకే ఆ పరిస్థితి సంభవిస్తే.. మనం ఆ పరిస్థితిలో ఉంటే అని ఆలోచించాను. అనాథ పిల్లల కోసం ప్రభుత్వం త్వరలోనే మంచి కార్యాచరణను రూపొందించి తీసుకువస్తామన్నారు. కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశాం. హాస్టల్స్ను పెంచుతున్నాం. అనాథ పిల్లలు స్టేట్ చిల్డ్రన్ కింద ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వమే అనాథలకు తల్లిదండ్రులు. వారిని ఆదరించాలి. అనాథ బిడ్డలు తారసపడితే వారిని చేరదీసి, కడుపులో పెట్టుకుని సాదుకోవాల్సిన అవసరం ఉంది అని సీఎం కేసీఆర్ అన్నారు.