హైదరాబాద్ : సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జి అయ్యారు. యశోద నుంచి కేసీఆర్ నేరుగా ప్రగతి భవన్కు వెళ్లారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం కేసీఆర్ను కాసేపు అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జి చేశారు. కేసీఆర్కు ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేవని యశోద ఆస్పత్రి వైద్యులు ఫిజిషీయన్ ఎంవీ రావు, కార్డియాలజిస్ట్ ప్రమోద్ కుమార్ స్పష్టం చేశారు. పలు రకాల వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్కు సర్వైకల్ స్పాండిలోసిస్ అని నిర్ధారించామని వారు పేర్కొన్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించామని వైద్యులు తెలిపారు.
సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో యశోద ఆస్పత్రికి వచ్చారు. డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలో కేసీఆర్కు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, రక్త పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, కూతురు కవిత, మనుమడు హిమాన్షు, మంత్రి హరీశ్రావు, ఎంపీ సంతోష్ కుమార్తో పాటు పలువురు ఉన్నారు.