హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాబోయే ఎన్నికల యుద్ధంలో గెలిచి రావాలని బీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆశీర్వదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రమంతటా బీఆర్ఎస్ అనుకూల వాతావరణం ఉన్నదని, ప్రజల మద్దతుతో మరోసారి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేయాలని, పార్టీ అన్ని విధాలా తోడ్పాటుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రగతి భవన్లో మంగళవారం కేసీఆర్ను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమపై పెట్టిన బాధ్యతను, నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.