న్యూఢిల్లీ : రైతుల పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ రూపొందించాలని కేంద్రాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే మోదీని తరిమికొడుతాం అని హెచ్చరించారు. వచ్చే ప్రభుత్వంతో ఆ పాలసీని రూపొందిస్తామని స్పష్టం చేశారు. మోదీకి ధనం కావాలి లేదా ఓట్లు కావాలి. ధాన్యం వద్దు.. ఇదే మీ ప్రభుత్వ కుట్ర అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. రైతులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.
రైతుల సంక్షేమం కోసం జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్తో కలిసి పని చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజానీకం తికాయత్ వెంట ఉంటుందని చెప్పారు. రాకేశ్ తికాయత్ను కేంద్రం ఎన్ని విధాలుగా అవమానించిందో మనమంతా చూశామని తెలిపారు. తికాయత్ను దేశద్రోహి అన్నారు.. ఉగ్రవాది అన్నారు. రైతుల కోసం అవమానాలు భరిస్తూనే ముందుకు సాగుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.