హైదరాబాద్, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్యాదవ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్మనోహర్ లోహియా, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రాజ్నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయంసింగ్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితాంతం నిరుపేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పనిచేశారని గుర్తుచేసుకొన్నారు. ములాయంసింగ్యాదవ్ కుమారుడు అఖిలేశ్యాదవ్కు, వారి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ములాయం అంత్యక్రియలకు సీఎం కేసీఆర్
ములాయంసింగ్యాదవ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వగ్రామం సైఫయీకి మంగళవారం మధ్యాహ్నం సీఎం చేరుకొంటారు. ములాయం పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు. ములాయం అంత్యక్రియల్లో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ వెంట పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కూడా వెళ్లనున్నారు.
శకం ముగిసింది: కేటీఆర్
ములాయం మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ములాయంకు నివాళి అర్పించారు. దేశ రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపారు. ములాయం మృతి పట్ల మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా సంతాపం వ్యక్తంచేశారు.