హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఉక్కుగుండె ఒక్కసారిగా తల్లడిల్లింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్నాయత్నం జరిగిందనే వార్త తెలిసి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తన కుటుంబసభ్యుడిలాంటి ప్రభాకర్రెడ్డిపై దాడెట్లా జరిగిందని ఆవేదన చెందారు. ప్రజాఆశీర్వాద సభల్లో భాగంగా సోమవారం జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్ నియోజవర్గాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. జుక్కల్లో సభ పూర్తి అయి హెలిప్యాడ్ వద్దకు రాగానే ప్రభాకర్రెడ్డిపై దా డి జరిగిందనే విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో హెలికాప్టర్లో కూర్చొని మంత్రి హరీశ్కు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. నారాయణఖేడ్ సభలో కేసీఆర్ ఉద్విగ్నానికి లోనై, జీరగొంతుతో మాట్లాడారు. ‘మీ ఉత్సాహం చూ స్తుంటే చాలాసేపు మాట్లాడాలని నాకూ ఉన్నది. కానీ, దురదృష్టం. కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు, ప్రజల చేతుల్లో గెలవటం చేతకాక మన ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడికి తెగబడ్డరు. ప్రచారంలో ఉన్న ప్రభాకర్రెడ్డి మీద కత్తులతో దాడి చేసినరు.
ఇదెంతో బాధాకరం. మంత్రి హరీశ్రావు కూడా ఈ సభకు రావాల్సి ఉండే. కానీ, ఆయన వెంటనే అక్కడికి పరిగెత్తుకునివెళ్లి యశోద హాస్పిటల్లో చేర్పించారు. రక్తం కారుతున్నది. మూడించుల లోతుకు కత్తి దిగింది. అందుకే వెంటనే ప్రభాకర్రెడ్డిని యశోద దవాఖానకు తీసుకెళ్లి ప్రాణాలు కాపాడినరు. దేవుని దయవల్ల ఆయన ప్రాణానికి అపాయం లేదు. 50 నుంచి 60 మంది మన పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు. నేను వెంటనే అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉన్నది. నేను జుక్కల్లో ఉన్నప్పుడే మెసేజ్ వచ్చింది. వెంటనే వెళ్లాలని నిర్ణయించుకున్న. కానీ, బాన్సువాడలో లక్షకు పైగా జనం వచ్చినారు. ఇక్కడా అంతేసంఖ్యలో మీరొచ్చినరు. ప్రాణాపాయం లేదని తెలిసినంక కాస్త కుదుటపడ్డ. మళ్లీ ఆలోచించిన. జనం భారీగా తరలివచ్చినరు. మళ్లీ నేను రాకుంటే నర్వస్ అయితరని, నమస్కారం పెట్టి పోదామని చెప్పి ఇంతదూరం వచ్చిన’ అని అన్నారు. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి దవాఖానలో ప్రభాకర్రెడ్డిని పరామర్శించే వరకు ఆయన ఆందోళనలోనే కనిపించారు. పరామర్శ తర్వాతే కాస్త కుదుటపడ్డారు.
గన్మెన్కు నమస్కారం
దవాఖానలో ప్రభాకర్రెడ్డిని పరామర్శించి తిరిగి ప్రగతిభవన్కు బయలుదేరేముందు ప్రభాకర్రెడ్డి గన్మెన్ను సీఎం కేసీఆర్ దగ్గరికి పిలిపించుకొని నమస్కరించారు. గన్మెన్ సమయస్ఫూర్తితో నిందితుడి నిరోధించారని, దాంతో ప్రమాద తీవ్రత తగ్గిందని వైద్యులు సీఎంకు వివరించారు. దీంతో గన్మెన్ను దగ్గరికి తీసుకొని నమస్కారం చేసి తన సంస్కారాన్ని చాటుకున్నారు.
అనుమానం రాగానే పట్టుకున్న
ప్రచారం ముగిసిన తర్వాత కారులో ప్రభాకర్రెడ్డి సార్ ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడిచేశాడు. వెంటనే అతని వద్ద నుంచి కత్తిని లాక్కునే ప్రయత్నం చేశా. దాంతో నా చేతికీ గాయమైంది. అందరు చూస్తుండగానే కత్తితో పొడిచాడు. రక్తం కారటంతో వెంటనే కారులో గజ్వేల్ దవాఖానకు తీసుకువచ్చాం. దాడి చేసిన వ్యక్తిని అక్కడున్న పార్టీ కార్యకర్తలు పట్టుకున్నారు.
– ప్రభాకర్రెడ్డి గన్మెన్