హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వాలు హైదరాబాద్ నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను క్రమానుగతంగా అభివృద్ధి చేయకపోవడం వల్లే వర్షాలకు రోడ్లను వరదలు ముంచెత్తుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ను వరదల నుంచి కాపాడుతామని స్పష్టం చేశారు. నీళ్లు నిల్వ ఉండకుండా చేయాలంటే రూ.15వేల కోట్లు అవసరమని అధికారులు చెప్పారని.. కాబట్టి దశల వారీగా పనులు చేపడుతామని వెల్లడించారు. గురువారం అసెంబ్లీలో పల్లెప్రగతి-పట్టణప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
హైదరాబాద్ అద్భుతమైన చారిత్రక నగరం. 400 ఏండ్ల కిందట కులీకుతుబ్షా నుంచి ఇప్పటివరకు అనేక దశలుగా, దఫాలుగా విస్తరించింది. ‘బస్తే.. బస్తే.. బస్తియా బన్తే’ అన్నట్టు ఒక పరంపరలో ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీని మినహాయిస్తే దేశంలో ఐదు మెగా మెట్రో నగరాలున్నాయి. అవే ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఈ ఐదు నగరాలు మన దేశానికి ముఖ చిత్రమని ప్రధాని మోదీకి, అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడుకు చెప్పిన. ఏం చేద్దాం? అని వారు అంటే.. ‘ఏడాదికి రూ.50-60 వేల కోట్లు పెట్టండి. రూ.10వేల కోట్లు కేంద్రం ఇస్తది.. ఇంకో రూ.10వేల కోట్లు మీరు పెట్టుకోవాలని కండిషన్ పెట్టండి. ఇట్లా ఏటా రూ.20వేల కోట్లు పెడితే ఐదు నగరాలు ఓ పద్ధతికి వస్తయి’ అని చెప్పిన. ఆలోచన చాలా గొప్పగున్నదని అన్నరు తప్ప రూపాయి ఇయ్యలే. వస్తయనే ఆశలు కూడా లేవు. హైదరాబాద్ వరదల్లో మునుగుతున్నదని ప్రతిపక్షాలు అంటున్నయి. ఈ దుస్థితి కారణం ఎవరు? వాళ్లే క్రమానుగతంగా డ్రైనేజీ సిస్టం చేసి ఉంటే మా మీద ఈ భారం ఎందుకు పడుతుండే? మేము నిన్నగాక మొన్న వచ్చినం కదా! మీరు బాగా చేస్తే మేమేమన్నా సుఖపడుతున్నమా? అప్పటి తప్పులను సదురలేక సస్తున్నం. నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో సీఎం ఇంటి ముంగట నీళ్లేంది? అసెంబ్లీ ముంగట నీళ్లేంది? అని అడిగితే వరదనీరు పోకుండా ఇష్టమొచ్చినట్టు వెంచర్లు వేసి, నిర్మాణాలు చేసిన్రని అధికారులు అన్నరు. నగరంలో నీళ్లు నిలువకుండా చేయాలంటే రూ.15వేల కోట్లు కావాలని చెప్పిన్రు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వనరులు ఉండవు, ఒకరోజు చేయలేం, రకరకాల వ్యూహాలు చేసి మీరే చేయండని మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇచ్చినం. హైదరాబాద్ అనేక సంస్కృతులతో కూడిన కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి ఈ నగరాన్ని ఎంత గొప్పగా చేస్తే మన రాష్ట్ర ప్రతిష్ఠ అంత పెరుగుతదని చెప్పిన. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్లు నాలాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నరు. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతం.
ఎక్కడెక్కడి నుంచో బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వస్తుంటారు. వాళ్ల దయనీయ పరిస్థితి చూసిన తర్వాతే ప్రభుత్వం జీవో నంబర్ 58 తెచ్చింది. కటాఫ్ డేట్ నాలుగుసార్లు పొడిగించాం. మళ్లీ మళ్లీ పెంచితే ఆక్రమణలు పెరుగుతాయి. ఇది సరైంది కాదు. (అక్బరుద్దీన్ను ఉద్దేశించి..) మీరు హైదరాబాద్కు చెందినవారు, హోం మంత్రి మహమూద్అలీ, శ్రీనివాస్యాదవ్, ఎంపీలు, నగర ఎమ్మెల్యేలంతా జీవో 58 ఎప్పటి వరకు ఉంచాలి? అన్నది చర్చించండి.. దీనిపై క్యాబినెట్ సబ్కమిటీ కూడా ఏర్పాటు చేశాం. సబ్కమిటీతో హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు కూర్చొని నిర్ణయిస్తే ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను మెచ్చుకున్నందుకు అక్బరుద్దీన్కు కృతజ్ఞతలు. అమృత్ పథకంలో కేంద్రం నుంచి మన రాష్ర్టానికి రూ.831 కోట్లు మంజూరయ్యాయి. వరంగల్కు రూ.196 కోట్లు, కరీంనగర్కు రూ.196 కోట్లు ఇచ్చారు. వీటిల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలుపుకొని ఇప్పటి వరకు రూ.1,753 కోట్లు ఖర్చు చేశాం. పనులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలను మున్సిపల్ మంత్రి రాతపూర్వకంగా సభ్యులకు అందిస్తారు.