నల్లగొండ : రేపు కేసీఆర్ ఎంత పెద్దగ పెరిగినా.. బీఆర్ఎస్ పునాది రాయి మునుగోడే కాబోతది కాబట్టి మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటాను అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మీకు అన్ని రకాలుగా అండదండగా ఉంటాను అని మనవి చేస్తున్నాను. మీరు పునాది రాయి వేయాలని, భాగస్వాములు కావాలని పేరుపేరునా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఎనిమిదేండ్లలో తెలంగాణ పచ్చబడ్డది. కొద్దిగా ముఖం తెల్లవడ్డది. పేదసాదలను ఆదుకుంటున్నాం. సంక్షేమం చేసుకుంటున్నాం. తెలంగాణ లాగానే భారతదేశాన్ని తయారు చేయాలని ఈ రోజు పుట్టుకొస్తున్నదే బీఆర్ఎస్ పార్టీ. మునుగోడు ప్రజలకు చాలా గొప్ప అవకాశం. వామపక్ష, టీఆర్ఎస్ కార్యకర్తలకు మనవి చేస్తున్నా. చరిత్రలో సువర్ణావకాశం మునుగోడుకే దక్కింది ఈ ఉప ఎన్నిక ద్వారా అని మనవి చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీకి భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పడానికి, పునాది రాయి పెట్టడానికి మీకే అవకాశం దొరికింది మునుగోడు ప్రజలకు అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
ఒకనాడు సిద్దిపేట నుంచి తెలంగాణ కోసమని బయల్దేరుతాను అంటే, అక్కడ వచ్చిన ఉప ఎన్నికలో ఆ బిడ్డలు 60 ఓట్ల మెజార్టీ సద్ది కట్టి నన్ను తెలంగాణ పోరాటానికి పంపించారు. ఇవాళ మిమ్మల్ని కూడా కోరుతున్నాను. ప్రభాకర్ రెడ్డిని గెలిపించే రూపంలో కేసీఆర్కు మీరు ఎంత పెద్ద సద్ది కడుతారో అంత పెద్ద విజయం భారతదేశంలో వస్తది. ఈ దేశమే బాగుపడుతదని మనవి చేస్తున్నాను అని కేసీఆర్ స్పష్టం చేశారు.