ఇప్పుడు తెలంగాణకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు చెప్పారు. తమకు 103 ఎమ్మెల్యేలతో పూర్తి మెజారిటీ ఉన్నదని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్తి మెజారిటీ ఉండగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. కొందరు భేవకూప్గాళ్లు అదేపనిగా చెబుతున్నారు.. మాకేమైనా పిచ్చికుక్క కరిచిందా.. వాడెవడో కుక్కగాడు మొరిగితే ముందస్తు ఎన్నికలకు వెళతమా అని కేసీఆర్ నిలదీశారు.
ఇంతకుముందు 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టులు, కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అందువల్లే సరైన టైంలో 8 నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లామని తెలిపారు.
ఈసారి షెడ్యూల్ ప్రకారం గడువు దాటిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 95-105 స్థానాల్లో గెలుపొందుతుందని సంచలన ప్రకటన చేశారు. ‘ ఇందులో సందేహం లేదు. ఇది నామాట. ఈ సారి కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి నా దగ్గర మంత్రం ఉంది. ఇంతకుముందు ముందస్తు ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు వెళ్లినం.. ఈసారి ఆరు నెలల ముందు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తాం అని చెప్పారు. ఎవడో మెదడు లేనోడు. పిచ్చినాకొడుకు చెప్పినడని ముందస్తు ఎన్నికలకు వెళ్లం’ అని స్పష్టం చేశారు.