CM KCR | ‘ప్రాజెక్టుల నుంచి నదుల్లోకి నీళ్లు ఇడుస్తరా? తెలంగాణ బాధ మనకు తెలుసు. పండెటోనికి ఎరుక గూనివాటం.. మన రైతులకు అవసరం కాబట్టి.. హల్దివాగులో గానీ.. కూడవెల్లి వాగులోకి ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదులుకుంటున్నాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దుబ్బాకలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడుతూ.. ‘ప్రభాకర్రెడ్డి నాకు సన్నిహితుడు. ప్రభాకర్రెడ్డి యోగ్యత ఉన్న వ్యక్తి. అతను దుబ్బాకలో నిలుబడత అని అడుగలేదు. ఆయన ఎంపీగా ఉన్నడు. మళ్లీ ఎంపీగా గెలుస్తడు. ఆయనకు నేనే చెప్పినా.. దుబ్బాకను కాపాడే అవసరం ఉంది.. ప్రభాకర్ అక్కడ పోటీకి రావాలని నేను కోరినా. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే. ఇక్కడ ఆర్డీవో ఆఫీసు కావాలని ప్రభాకర్రెడ్డి కోరిండు. ప్రభాకర్రెడ్డిని గెలిపించండి.. నెల రోజుల్లోనే ఆర్డీవో ఆఫీసు తెచ్చి పెట్టే బాధ్యత నాది అని చెబుతున్నాను. రెండుమూడు కాలేజీలు కావాలని కోరారు. మల్లన్నసాగర్ను తెచ్చుకున్నాం. మన నెత్తిమీద కుండలా ఉన్నది. దుబ్బాక నియోజకవర్గం మొత్తానికి 1.75లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. కాలువల పనులు జరుగుతున్నయ్. కూడవెల్లి వాగు మునుపు ఎట్లుండే. ఎండిపోయి నెత్తిమీద నీళ్లు చల్లుకుందామనుకున్నా లేకుండే. ఇవాళ కూడవెల్లి వాగు ఎండకాలంలో కూడా మత్తళ్లు దుంకుతున్నది’ అన్నారు.
‘మల్లన్నసాగర్ పుణ్యమాని గోదావరి నీళ్లు కూడవెల్లి వాగులోకి వచ్చి ఎండాకాలంలో మత్తళ్లు దుంకుతున్నయ్. రైతుల పంటలు పండుతున్నయ్. ప్రాజెక్టుల నుంచి నదుల్లోకి నీళ్లు ఇడుస్తరా? తెలంగాణ బాధ మనకు తెలుసు. పండెటోనికి ఎరుక గూనివాటం.. మన రైతులకు అవసరం కాబట్టి.. హల్దివాగులో గానీ.. కూడవెల్లి వాగులోకి ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదులుకుంటున్నాం. భూగర్భ జలాలు పైకి వచ్చి పంటలు పండుతున్నయ్. ఇంకా బాగా అభివృద్ధి కావాలి.. ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. యోగ్యత కలిగిన వ్యక్తి ప్రభాకర్రెడ్డి. కూడెల్లి దేవుడి ఆలయాన్ని, రేగులకుంట మల్లన్న జాతరకు వెళ్లాను. ఆలయాలన్నీ బాగు చేసుకుందాం.. దుబ్బాక ఇంకా అభివృద్ధి కావాలి. దుబ్బాక మీద నాకు ప్రేమ ఉంటది. దుబ్బాక నాది. ఈ విషయం నాకు తెలుసు. దుబ్బాక రింగ్ రోడ్ కావాలని ప్రభాకర్రెడ్డి అంటున్నడు. వెంటనే సర్వే చేయించి.. దాన్ని కూడా మంజూరు చేయిస్తామని హామీ ఇస్తున్నాను. రాబోయే రోజుల్లో పట్టణం పెరుగుతుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయ్యింది. రూ.200కోట్లతో అభివృద్ధి చేసుకుందాం. ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే తప్పకుండా దుబ్బాక సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నాది’ అన్నారు.