CM Breakfast | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ):సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని గురువారం నుంచి మండలానికొక బడిలో అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయాలని ఎంఈవోలను పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో బుధవారం బ్రేక్ఫాస్ట్ పథకం అమలుపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సమీక్ష నిర్వహించారు. గురువారం నుంచి మండలానికొక బడిలో ఈ పథకాన్ని విస్తరించాలని ఆదేశించారు. ఆ తర్వాత సోమవారం మరికొన్ని స్కూళ్లు, ఆపై వచ్చే మూడు సోమవారాలు పూర్తయ్యే నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పథకం విజయవంతమై సత్ఫలితాలిస్తున్నది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈ పథకాన్ని ప్రారంభించిన బడుల్లో విద్యార్థుల హాజరుశాతం పెరిగింది. డుమ్మాలు, డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయి. స్కీం అమలైన గత 20 రోజుల వ్యవధిలోనే బడులకు విద్యార్థుల హాజరు భారీగా పెరగడం విశేషం. గురువారం నుంచి మండలానికొక బడి చొప్పున ఈ పథకాన్ని విస్తరించనున్నారు. వచ్చే సోమవారం నుంచి స్కూళ్ల సంఖ్యను పెంచుతూ.. మరో మూడు వారాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ను అందించనున్నారు. ఈ నెల 6న ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని నియోజకవర్గానికొక స్కూల్ చొప్పున ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్నారు. గత 20 రోజులుగా రాష్ట్రంలోని 119 బడుల్లో ఈ పథకం అమలవుతున్నది. డుమ్మాకొట్టే విద్యార్థులంతా ఇప్పుడు ఉదయాన్నే రెడీ అయి బడిబాట పడుతున్నారు. వారం వ్యవధిలోనే కొన్ని బడుల్లో 1015శాతం విద్యార్థుల హాజరు పెరగ్గా, మరికొన్ని స్కూళ్లలో 25శాతానిపైగా పెరిగినట్టు ఉపాధ్యాయులు చెప్తున్నారు. గతంలో ఇవే స్కూళ్లలో మధ్యాహ్న భోజనం తినేవారి సంఖ్య తక్కువగా ఉండేది. దీంతో హాజరుశాతం కూడా అదేస్థాయిలో నమోదయ్యేది. ఇప్పుడు విద్యార్థుల హాజరు పెరిగి బడులన్నీ కళకళలాడుతున్నాయి. ఈ స్కీం రాష్ట్ర విద్యావ్యవస్థలో గేమ్ఛేంజర్ వంటిదని.. కీలక మార్పునకు శ్రీకారం చుడుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. బడులన్నీ బలోపేతమవుతాయని వారు పేర్కొంటున్నారు.
పలు స్కూళ్లలో అమలు ఇలా..
ఒక్కో టిఫిన్కు రూ.8 -10
బ్రేక్ఫాస్ట్ స్కీం మెనూ ఇప్పటికే ఖరారుకాగా, ఒక్కో టిఫిన్కయ్యే వ్యయాన్ని కూడా విద్యాశాఖ అధికారులు అంచనావేశారు. ఒక్కోటిఫిన్కు రూ. 8 -10 అవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇడ్లీ, పూరి వంటి వాటికి రూ. 10, కిచిడి, పొంగల్ వంటి వారికి రూ. 8 ఖర్చు అవుతుందని తేల్చారు. ఇదిలావుండగా, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన మధ్యాహ్న భోజన స్కీంతో పోల్చితే టిఫిన్కయ్యే వ్యయం దాదాపు సమానంగా ఉండటం గమనార్హం.
రూ. 100 కోట్లు కేటాయించిన సర్కారు
బడుల్లో బ్రేక్ఫాస్ట్ పథకం అమలుకు ఏటా రూ. 400 కోట్లు అవసరమవుతుందని ప్రభుత్వం అంచనావేసింది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సర్కా రు రూ. 100 కోట్లను విడుదల చేసింది. సర్కారీ బడుల్లో విద్యార్థులకు మూడు పూటలా కడుపు నిండా తిండి పెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూ పొందించింది. ఇందులోభాగంగా విద్యార్థులు ఉద యం బడికి రాగానే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం రాగి జావను అందిస్తున్నారు.
పోషకాహారం కోసం వెయ్యికోట్లు
ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా ఖర్చుచేస్తున్నది. ఏటా వెయ్యి కోట్లకుపైగా నిధులను వెచ్చిస్తున్నది. మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం కోసం ఏటా రూ.187 కోట్లు, ప్రొటీన్లు సమకూర్చడంలో భాగంగా అందిస్తున్న కోడిగుడ్ల కోసం రూ.120 కోట్లు, 9, 10 తరగతులకు అమలుచేసేందుకు రూ.137 కోట్లు, రక్తహీనతను నివారణకు అందజేస్తున్న రాగిజావ అమలుకు రూ. 32 కోట్లను ప్రభుత్వమే ఖర్చు చేస్తున్నది. తాజాగా బ్రేక్ఫాస్ట్ను పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే సమకూర్చడం విశేషం. మొత్తంమీద మధ్యాహ్న భోజన పథకం కోసం ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ.672 కోట్లను ఖర్చుచేస్తుండగా, బ్రేక్ఫాస్ట్ కోసం రూ.400 కోట్లకు పైగా నిధులను వెచ్చిస్తున్నది.