పోటాపోటీగా సామాజిక సేవా కార్యక్రమాలు
దేశ్ కీ నేతా అంటూ వెల్లువెత్తిన నినాదాలు
ఊరూరా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు, విభిన్నవర్గాల ప్రజలు సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వినూత్న రీతిలో వేడుకలు నిర్వహించారు. ఆలయాల్లో హోమాలు, ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కేక్ కటింగ్, మొక్కలు నాటడం, నామకరణం, సీఎం ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం, ధాన్యాభిషేకం, రక్తదానం, కేసీఆర్ అక్షరమాల, బాలింతలకు కిట్లు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు, రోగులకు పండ్లు పంపిణీ, ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ సంబురాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డులో 50 అడుగుల సీఎం కేసీఆర్ భారీ కటౌట్కు ప్రత్యేక క్రేన్ సాయంతో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బీబీ పాటిల్ క్షీరాభిషేకం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్రెడ్డి మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో కేక్ కట్ చేసి, 68 కిలోల బెల్లాన్ని సమ్మక్క-సారలమ్మకు సమర్పించారు. తెలంగాణభవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి భారీ ఫ్లయింగ్ కేక్ను కట్ చేశారు. అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్ అమినుల్ హసన్ జాఫ్రీ, మంత్రి కేటీఆర్తో కలిసి కట్ చేశారు.
మంత్రి హరీశ్రావు సిద్దిపేట శివారులోని రంగనాయకసాగర్ నుంచి నీటిని విడుదల చేసి, కేక్ కట్ చేశారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి, మహబూబ్నగర్ కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఖమ్మం పార్టీ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్, నిజామాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కేక్ కట్ చేశారు. మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట రైతు వేదిక వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రతిమలను పంపిణీచేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీఎన్జీవో భవన్లో రక్తదానం చేశారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున చెంగిచర్ల అటవీప్రాంతంలో అభివృద్ధి చేయనున్న అర్బన్ పార్క్కు ఎంపీ సంతోష్కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్లోని కళింగభవన్లో కేసీఆర్ జీవిత ప్రస్థానం ఇతివృత్తంగా ఆర్టిస్ట్ సుధాకాంత్ ప్రదర్శించిన సాండ్ యానిమేషన్ ఆర్ట్ ఆకట్టుకుంది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం బాలయేసు ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల విద్యార్థులు ‘విషింగ్ 68 బర్త్డే టు హానరబుల్ సీఎం కేసీఆర్’ ఆకృతిలో కూర్చొని కనువిందు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో గురువారం ఒక్కరోజే ఐదు లక్షల మొక్కలు నాటినట్టు కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. చెన్నూర్ మండలం అంగ్రాజ్పల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో 30 మంది దళితులు తమ పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడక నుంచి గజ్వేల్ వరకు 68 కిలోమీటర్ల మేర ‘రన్ ఫర్ కేసీఆర్’ పేరుతో అల్ట్రా రన్ పరుగు చేపట్టారు. ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ ఎన్నారై నాయకుడు 15 వేల అడుగుల నుంచి బెలూన్ ద్వారా కిందికి దిగుతూ కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణభవన్కు పండుగ శోభ
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను తెలంగాణభవన్లో పండుగ వాతావరణంలో నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం కేసీఆర్ జీవితచరిత్ర, ఉద్యమ నేపథ్యంపై త్రీడీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్తో హిందీలో రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శనను కేశవరావు ప్రారంభించారు. తెలంగాణభవన్ను కటౌట్లు, గులాబీ రంగుల బెలూన్లతో అందంగా, ఆకర్షణీయంగా అలంకరించారు.గోండు, గుస్సాడి, పులి వేషధారణలు, బోనాలు, చెంచు, కోయ, ఒగ్గు కళాకారులు నిర్వహించిన డప్పు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సీఎం కేసీఆర్, సతీమణి శోభతో కలిసి ఉన్న ఫొటోలను భారీ సైజుల్లో ముద్రించి తెలంగాణభవన్ అంతటా ఏర్పాటుచేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు, లంబాడీలు సంప్రదాయ వస్త్రధారణతో వచ్చి, జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎంపీ రంజిత్రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు వాణీదేవి, పాడి కౌశిక్రెడ్డి, యెగ్గే మల్లేశం, కార్పొరేషన్ చైర్మన్లు ఆయాచితం శ్రీధర్, దూదిమెట్ల బాలరాజ్యాదవ్, గజ్జెల నగేశ్, దామోదర్గుప్తా తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్
సీఎం కేసీఆర్కు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా హ్యాపీ బర్త్డే కేసీఆర్ హ్యాష్ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయ్యింది. ట్విట్టర్లో ఈ హ్యాష్ట్యాగ్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. 1.30 లక్షలకుపైగా ట్వీట్లు వచ్చాయి. గురువారం కొన్ని గంటలపాటు ఈ హ్యాష్ట్యాగ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండటం విశేషం. గురువారం నాటి టాప్ ట్రెండింగ్లో మ్యుజీషియన్ యోంగ్జున్ (దక్షిణ కొరియా), డాన్సర్ హోబి (దక్షిణ కొరియా), సూర్య నటించిన సినిమా ‘ఎతక్కుమ్ తునిందవన్’ (తమిళ) టాప్-3లో నిలిచాయి. కేసీఆర్ 4వ స్థానం ఆక్రమించారు. గురువారం గూగుల్లో అత్యధిక శాతం మంది వెతికిన టాప్-20 పదాల్లో ‘కేసీఆర్’ 12వ స్థానంలో నిలిచారు. “కేసీఆర్.. దేశానికి దారి చూపే దిక్సూచి. భవిష్యత్తు తరాలకు ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ప్రదాత. జన హృదయాలను గెలిచిన కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అంటూ నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ఫొటోలను రూపొందించి డీపీలతో నింపేశారు. కేసీఆర్పై అద్భుత పదాలతో అల్లిన పాటలు యూట్యూబ్ను షేక్ చేస్తున్నాయి.
‘మా భూమి కోసం.. మా నేల కోసం.. నడిచింది నీ పాదం..’ అనే పాట
‘తూర్పు సూర్యుడు నీవేలే.. మా చీకటి చీలె నీవల్లే..’ అనే మరో పాట
సింగర్ మధుప్రియ పాడిన.. ‘అయ్యకు రుణ పడి ఉన్నాము’ అనే పాట
మంగ్లీ పాడిన ‘రైతన్నను రాజుగా చూశాము ఇక్కడే’ పాటలు యూట్యూబ్లో మార్మోగుతున్నాయి.
‘ఏ పల్లె పిల్లాడో.. ఏ తల్లి బిడ్డాడో.. అయ్యా కడుపు సల్లగుండా రాజ్యమే తెచ్చాడో..” సాంగ్ అందరినీ ఆకట్టుకుంటున్నది.