హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): సమానత్వం కోసం శ్రీరామానుజాచార్యులు బోధించిన ప్రవచనాలను ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ఎంతో నిబద్ధతతో అనుసరించడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ వేదికగా తిరిగి వెయ్యేండ్ల తర్వాత ఆ మహామూర్తి బోధనలు మళ్లీ మరింత ప్రాచుర్యంలోకి రావడం, అవి మరో వెయ్యేండ్లపాటు ప్రపంచవ్యాప్తం కానుండటం మనందరికీ ఎంతో గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచానికి సమతా దార్శనికుడైన శ్రీరామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని హైదరాబాద్లో స్థాపించడం అద్భుతమని అన్నారు. చినజీయర్స్వామి, వారి అశేష అనుచరులు, అభిమానులు ఇందుకు అవిరళ కృషి చేశారని కేసీఆర్ కొనియాడారు. ముచ్చింతల్లో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాల సందర్భంగా సీఎం కేసీఆర్ గురువారం సతీసమేతంగా కార్యస్థలిని సందర్శించారు. చినజీయర్స్వామి తన కుటీరంలోకి కేసీఆర్ దంపతులను సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమాల ఏర్పాట్ల గురించి జీయర్స్వామిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. శ్రీరామానుజాచార్యులవారు భక్తి ఉద్యమంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చారని అన్నారు. మానవులు అందరూ సమానమని చెప్పారని, సమానత్వం కోసం వెయ్యేండ్ల క్రితమే ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. దివ్యసాకేతంలో ఏర్పాటు చేస్తున్న ప్రతిష్ఠాత్మక దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక సాంత్వన, మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పారు. పర్యాటకులకే కాకుండా మానసిక ప్రశాంతత కోరుకునే ప్రతి ఒకరికీ ఇది ప్రశాంత నిలయంగా మారుతుందన్నారు. సమతా మూర్తి విగ్రహ స్థాపన దేశం గర్వించదగినదని సీఎం కొనియాడారు.
సమారోహ కార్యక్రమం సందర్భంగా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం దగ్గరుండి చూసుకుంటున్నది. సమారోహానికి హాజరౌతున్న ముఖ్య అతిథులకు ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకున్నది. ఈ మహా ఉత్సవానికి వచ్చే పండితులు, భక్తుల కోసం మా కుటుంబం తరఫున ఫలాలు, ప్రసాదం అందజేస్తాం.
– ముఖ్యమంత్రి కేసీఆర్
హిందూ ధర్మాన్ని అనుసరించే ఆధ్యాత్మిక భక్తులకు, ధార్మికులకు ముచ్చింతల్లో సకల వసతులను సమకూర్చడం సంతోషకరమని, ఈ పుణ్యక్షేత్రం భవిష్యత్తులో మరింత సుందర మనోహర దివ్యక్షేత్రంగా అలరారనున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. అనతికాలంలోనే ఈ సమతామూర్తి వేదిక ప్రపంచ ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విశేష ప్రాచుర్యం పొందుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరామానుజుల కోట్లాది భక్తులకు భారతదేశంలో మరో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లుతుందని చెప్పారు. శ్రీరామానుజుల వారి సమతా స్ఫూర్తిని అందుకొని తెలంగాణ ముందుకు సాగుతుందని తెలిపారు. కులాలకు, మతాలకు అతీతంగా విభిన్న సాంసృతిక, సంప్రదాయాలను ఏకతాటిపైన నడిపించే సామాజిక సమతను తాము కొనసాగిస్తామన్నారు. రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపనకైన మొత్తం ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం, అన్నిరకాల ఏర్పాట్లను స్వయంగా జీయర్ స్వామివారే దగ్గరుండి చూసుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ మహాకార్యంలో తమ శక్తివంచన లేకుండా పనిచేస్తున్న చినజీయర్ స్వామి వారి మిషన్కు శతసహస్ర వందనాలు తెలియజేస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.
సమారోహ కార్యక్రమం సందర్భంగా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం దగ్గరుండి చూసుకుంటున్నదని చినజీయర్ స్వామికి మరోమారు కేసీఆర్ తెలిపారు. సమారోహానికి హాజరౌతున్న ముఖ్య అతిథులకు ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకున్నదని చెప్పారు. ఈ మహా ఉత్సవానికి వచ్చే పండితులు, భక్తుల కోసం తమ కుటుంబం తరఫున ఫలాలు, ప్రసాదం అందజేస్తామని కేసీఆర్ తెలిపారు. సహస్రాబ్ది వేడుకల ఏర్పాట్లను చినజీయర్స్వామిని అడిగి తెలుసుకున్నారు. 5వ తేదీన ప్రధాని మోదీ రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితమివ్వనుండగా, అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా కేసీఆర్ పరిశీలించారు. పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం దివ్యసాకేత క్షేత్రం నుంచి సతీసమేతంగా యాగశాలకు చేరుకున్నారు. యాగశాలలో కొలువైన పెరుమాళ్లుస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేవుని ముందు ప్రజలందరూ సమానమేనని, ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడని అన్నారు. రామానుజాచార్యులు ఇదే సిద్ధాంతాన్ని విశ్వసించడంతో పాటు అందుకోసం విశేష కృషి చేశారని కొనియాడారు. రామానుజాచార్యులు చాటిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకుసాగాలని, ప్రకృతిని సంరక్షించాలని, తోటి మానవులను ప్రేమించాలని, సంతోషాన్ని, బాధను ఇతరులతో పంచుకోవాలని, సమతాస్ఫూర్తితో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు, ఎండీ జగపతిరావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులున్నారు.
శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహాల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్తగా సమకూరుస్తుండటం పట్ల చినజీయర్స్వామి సంతోషం వ్యక్తం చేశారు. యాగాలు నిర్వహించడానికి తమిళనాడు, కర్ణాటక, తిరుపతి నుంచే కాకుండా నేపాల్ తదితర దేశాల నుంచి, దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ క్షేత్రాల నుంచి కూడా వేదపండితులు తరలివస్తున్నారని సీఎంకు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు ప్రభుత్వం రవాణా లోటు లేకుండా చేయడం హర్షణీయమన్నారు. సమారోహానికి తరలివస్తునభ్న భక్తుల కోసం స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయని చెప్పారు. అన్నీ పద్ధతి ప్రకారం సాగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు, నీరు, శానిటైజేషన్ తదితర అన్ని శాఖల అధికారులు సహకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే కార్యక్రమాలు పురోగతిలో ఉన్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక, ధార్మిక విషయాల పట్ల ఇష్టాన్ని పెంచుకోవడం మంచి అలవాటని కల్వకుంట్ల హిమాన్షును చినజీయర్ స్వామి ఈ సందర్భంగా ఆశీర్వదించారు. ‘తాత కేసీఆర్ నుంచి ఆధ్యాత్మికత, భక్తి ప్రపత్తుల విషయాల్లో వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నావు’ అంటూ అభినందించారు.
ముచ్చింతల్లో రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం అరణి మథనం క్రతువును చినజీయర్ స్వామి నేతృత్వంలో వేలాది వేదపండితులు అట్టహాసంగా నిర్వహించారు. రావి, శమీ కర్రలను రాపాడించి అగ్నిని ఆవాహన చేయడమే అరణి మథనం. అనంతరం అగ్నిని యాగశాలలో ప్రతిష్ఠ చేశారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగ క్రతువును ప్రారంభించారు. 5 వేల మంది రుత్విక్కుల వేదమంత్రోచ్చారణ మధ్య యాగం వైభవంగా కొనసాగింది. నాలుగు దిక్కులలో మొత్తం 114 యాగశాలలు ఉండగా, ఒక్కో యాగశాలలో 9 కుండాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కుండానికి ఒక్కో ఆగమ విద్వాంసులు నిర్వాహకులుగా కొనసాగారు. మొత్తం 5 వేల మంది రుత్విక్కుల వేదమంత్రోచ్చారణల మధ్య 1035 కుండాలలో మహాయజ్ఞం ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా యాగశాల విశిష్టతను చినజీయర్ స్వామి వేదపండితులు, భక్తులకు వివరించారు. యాగశాలను మొత్తంగా నాలుగు భాగాలుగా విభజించినట్టు వివరించారు. యాగశాలలో ఏర్పాటు చేసిన భోగ మండపం శ్రీరంగానికి ప్రతీకని, పుష్ప మండపం తిరుమల క్షేత్రానికి, త్యాగ మండపం కాంచీపురం క్షేత్రానికి, జ్ఞాన మండపం మేల్కొటే క్షేత్రానికి ప్రతీకలని అభివర్ణించారు. ఆయా పుణ్యక్షేత్రాలతో రామానుజాచార్యుల జీవితానికి అద్భుతమైన అనుబంధమున్నదని తెలిపారు.