ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ అభివృద్ధి నమూనాకు జై కొడుతున్నారు. అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధి మాడల్ గురించి ఇప్పుడు దేశమంతటా విసృ్తతంగా చర్చ జరగడం మనందరికీ గర్వకారణం. ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రతిభకూ, పటిమకూ తిరుగులేని నిదర్శనం. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, విలువలను ముందుకు తీసుకుపోయే క్రమంలో యావత్ భారతజాతి ఒకటిగా నిలవాలి.
దళిత, బడుగు, బలహీనవర్గాలు, రైతాంగం మొదలుకొని అగ్రవర్ణ పేదల వరకూ అందరికీ సంక్షేమ ఫలాలను అందజేస్తూ తెలంగాణ రాష్ట్రం సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తున్నది. అయినప్పటికీ కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారు. వ్యవసాయానికి మూడుగంటల విద్యుత్తు చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరి రైతు వ్యతిరేక వైఖరికి ప్రజలే తగిన సమాధానం చెప్పాలి.
– సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సమస్త జనులకు సంక్షేమ ఫలాలు అందజేస్తూ తమ ప్రభుత్వం సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలను అందజేస్తున్నదని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధులకు సీఎం ఘనంగా నివాళులర్పించారు. గత ఏడాది స్వాతంత్య్ర వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నామని, ఇప్పుడు ముగింపు ఘట్టాన్ని కూడా అంతే ఘనంగా నిర్వహించుకొంటున్నామని తెలిపారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా, ఆశించిన లక్ష్యాలను, చేరాల్సిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదని సీఎం కేసీఆర్ అన్నారు.
అన్నీ ఉండి కూడా ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వనరులను సంపూర్ణంగా వినియోగించుకొని ప్రగతి ఫలాలు అన్ని వర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే స్వాతంత్య్రానికి సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవన చిత్రాన్ని తలుచుకొంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్టయ్యి దు:ఖం తన్నుకొస్తదని అన్నారు. సుక నీరుకానరాని బోర్లు, ఎడతెగని కరెంటు కోతలు, అప్పుల ఊబిలో చికిన అన్నదాతలు, బతుకుమీద ఆశ చచ్చి ఉరి పెట్టుకొన్న చేనేత కార్మికులు, ఇండ్లకు తాళాలు పడి గడ్డి మొలుస్తున్న గోడలు, గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డు పరిస్థితులుండేవని గుర్తుచేశారు. అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాన్ని పవిత్ర యజ్ఞంగా నిర్వహించిందని సీఎం తెలిపారు. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధోమధనంతో అవిశ్రాంతంగా శ్రమించి తెలంగాణను విజయవంతంగా వికాసపథం వైపు నడిపించిందని చెప్పారు. అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిందని, ‘తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది’ అనే దశకు చేరుకొని దశాబ్ది ముంగిట సగర్వంగా నిలిచిందని పేర్కొన్నారు.
సంక్షేమంలో సువర్ణాధ్యాయం
నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే.. నిరంతర విద్యుత్తు ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నదని, పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. వాగులు, వంకలపై నిర్మించిన చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయని, కాళేశ్వర ఎత్తిపోతలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతున్నన్నదని అన్నారు. మూడు కోట్ల టన్నల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతూ.. సంక్షేమం, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నదని చెప్పారు. తెలంగాణ అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నదని, ఈ అద్భుతమైన పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా తెలంగాణ ప్రజలు సంపూర్ణ ఆశీర్వాద బలాన్ని ఇదే రీతిన అందించాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు.
ఈ ఐదింటిలో అగ్రస్థానం
అసలైన ప్రగతికి కొలమానాలైన తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, ఉత్తమ వైద్యారోగ్య, విద్యా ప్రమాణాల్లో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘పెద్ద రాష్ట్రాలను అధిగమించి తెలంగాణ రూ. 3,12, 398 తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. తలసరి విద్యుత్తు వినియోగంలో జాతీయ సగటు 1,255 యూనిట్లు ఉంటే, అంతకంటే 70 శాతం అధికంగా 2,126 యూనిట్లతో తెలంగాణ నంబర్ వన్గా నిలిచింది. విద్యుత్తు రంగంలో తెలంగాణది స్ఫూర్తిదాయకమైన విజయగాథ. అన్ని రంగాలకు 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని వివరించారు. రాష్ట్రంలో గత నెలలో అనూహ్యంగా, అసాధారణ స్థాయిలో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న ఇండ్లకు గృహలక్ష్మి పథకం కింద సాయం అందిస్తామని ప్రకటించారు. భారీ వర్షాల సమయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. తక్షణ సహాయ చర్యల కోసం రూ.500 కోట్లు విడుదల చేసిందని గుర్తుచేశారు. పంటలు దెబ్బతిన్న రైతులు మళ్లీ విత్తనాలు వేసుకొనేందుకు వీలుగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.
తెలంగాణ నమూనాకు జై
దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ అభివృద్ధి నమూనాకు జై కొడుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధి మాడల్ గురించి ఇప్పుడు దేశమంతటా విసృ్తతంగా చర్చ జరగడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రతిభకూ, పటిమకూ తిరుగులేని నిదర్శనమని తెలిపారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, విలువలను ముందుకు తీసుకుపోయే క్రమంలో యావత్ భారతజాతి ఒకటిగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ సమాపన వేడుకలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
37 వేలకోట్ల రుణమాఫీ
రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే రైతుల పంట రుణాలను సంపూర్ణంగా మాఫీ చేశామని, రెండోసారి అధికారంలోకి రాగానే మరోసారి పంటరుణాల మాఫీ చేపట్టామని చెప్పారు. ‘తొమ్మిదిన్నరేండ్లలో రెండు దశల్లో రైతులకు చెందిన దాదాపు రూ.37 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశాం. దేశంలో రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నది. నేడు పంజాబ్ను ఢీకొంటూ ప్రథమ స్థానానికి పోటీపడుతున్నది. కానీ, కొంతమంది అల్పబుద్ధులు రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెప్తున్నారు. వ్యవసాయానికి మూడుగంటల విద్యుత్తు సరఫరా చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరి రైతు వ్యతిరేక వైఖరికి ప్రజలే తగు విధంగా సమాధానం చెప్పాలి’ అని పిలుపునిచ్చారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేసి కరువుసీమలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,200 గ్రామాలకు తాగునీరు అందిస్తామని చెప్పారు. పోడు సమస్యకు శాశ్వత పరిషారం చూపుతూ 1.50 లక్షల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకుపైగా పోడు భూములపై యాజమాన్య హకులు కల్పించటంతోపాటు ఆ భూములకు రైతుబంధు ఇస్తూ, పోడు ఆందోళనల్లో నమోదైన కేసుల నుంచి విముక్తులను చేశామని వెల్లడించారు.