తొలి ప్రయత్నంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ( ఐఎఫ్ఎస్ )లో ఆలిండియా 86వ ర్యాంకు సాధించిన కాసర్ల రాజు ( Kasarla Raju )ను సీఎం కేసీఆర్ అభినందించారు. రాజును స్ఫూర్తిగా తీసుకుని ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మరింత మంది విద్యార్థులు ఇలాంటి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. తనలాంటి పేద విద్యార్థులు చదువుకుని.. ఐఎఫ్ఎస్ వంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు వీలుగా FCRI వంటి ప్రపంచ స్థాయి సంస్థను స్థాపించినందుకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కాసర్ల రాజు కృతజ్ఞతలు తెలిపాడు.
జనగాం జిల్లా సూరారం గ్రామానికి చెందిన కాసర్ల రాజు.. గత ఏడాది బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (FCRI)లో ఎమ్మెస్సీ అభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో ఫారెస్ట్రీ, జియాలజీ లను ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకుని రాజు ఐఎఫ్ఎస్ సాధించాడు. ఈ సందర్భంగా రాజును ఎఫ్సీఆర్ఐ (FCRI) డీన్ ప్రియాంక వర్గీస్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా ఐఎఫ్ఎస్ సాధనలో తనకు ప్రేరణనిచ్చి అన్ని రకాలుగా సహకరించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, డిప్యూటీ డైరెక్టర్ కె. శ్రీనివాస్, డిసిఎఫ్ ఎ.నరసింహ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బందికి రాజు ధన్యవాదాలు తెలియజేసారు