హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రైతుల పట్ల తన అభిమానాన్ని, ప్రేమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరోసారి చాటుకొన్నారు. మరణించిన రైతు కుటుంబానికి నేనున్నానంటూ అండగా నిలిచారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి ఇటీవల తెలంగాణలో పర్యటించిన జాతీయ రైతుసంఘం కార్యకర్త విమల్కుమార్.. తన పర్యటన అనంతరం హైదరాబాద్లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొన్న సీఎం కేసీఆర్ విమల్ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
జాతీయ రైతు సమాఖ్య కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు శాంతకుమార్ అధ్యక్షతన మైసూరులో మంగళవారం ఏర్పాటుచేసిన సభలో తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా చూశారు.ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి పథకాలు రైతులకు ఉపయోగపడుతున్నాయని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నాయని చెప్పారు. తెలంగాణ పథకాల గురించి తెలుసుకొన్న కర్ణాటక రైతాంగం, తమ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాలు అమలుచేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. అనంతరం రైతుసంఘం కార్యకర్త విమల్కుమార్ కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్ను అందించారు. కార్యక్రమంలో దక్షిణ భారత రైతు సంఘాల అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు, తెలంగాణ రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, చేతన్ పాల్గొన్నారు.