CM KCR | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి టూ హయత్నగర్ మెట్రోకు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రం కాకముందు ఈ జిల్లాల్లో మంత్రిగా పని చేస్తూ పటాన్చెరుకు వచ్చాను. ఇక్కడే సంగారెడ్డి అతిథిగృహంలో ఉంటూ పటాన్చెరులో గల్లీగల్లీ పాదయాత్ర చేశాను. సమస్యలన్నీ ఇంచుమించు సమస్యలన్నీ తెలుసు. మహిపాల్రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు ముందుకుదూసుకెళ్తున్నది. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఇక్కడి వరకు మెట్రోరైలు రావాలని కోరారు.
అందరికీ ఒకటే మాట చెబుతున్నా. రాష్ట్రం ఏర్పడే క్రమంలో అనేకమైనటువంటి అపవాదులు, అనేకమైన అపోహలు, అనుమానాలు కలిగించారు. తెలంగాణ చిమ్మని చీకటవుతుంది.. కరెంటు రానే రాదన్నారు. పటాన్చెరులో అప్పుడు పరిశ్రమల వారు కరెంటు కావాలని సమ్మెలు చేసేవారు. ఇవాళ మూడుషిఫ్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నయ్. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు 24గంటల కరెంటు ఇస్తున్నాం. ఎన్ని కష్టాలు, నష్టాలకోర్చి పరిశ్రమలు, డొమెస్టిక్, గృహాలకు, కమర్షియల్, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికీ నల్లాపెట్టి నీళ్లిచ్చే రాష్ట్రం తెలంగాణ. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ తెలంగాణ. ఎందుకు కొరగాకుండాపోతారని ఎవరైతే శాపాలు పెట్టారో వారిని మించిపో.. 3.17లక్షలతో పర్క్యాపిటా ఇన్కంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నాం’ అన్నారు.
‘ఈ ప్రగతి అంతా మీ అందరి ప్రేమ, మద్దతు, కార్మికుల కృషి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల కృషితో ఇదంతా సాధించాం. మెట్రోరైల్ సంగారెడ్డికి రావాలంటున్నారు. తప్పనిసరిగా రావాలి. ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి వెళితే.. మహేశ్వరానికి మెట్రో రావాలని కోరారు. అక్కడే ఆ సభలోనే నేను చెప్పాను. హైదరాబాద్ సిటీలో అత్యధికంగా ట్రాఫిక్ ఉండే కారిడర్ పటాన్చెరు నుంచి దిల్సుఖ్నగర్. పటాన్చెరువు నుంచి హయత్నగర్ వరకు మెట్రోరావాల్సి ఉంది. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే మెట్రో తప్పకుండా వస్తుంది. మళ్లీ వచ్చే ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో పటాన్చెరు నుంచి హయత్నగర్ మెట్రోరైలుకు మంజూరు ఇప్పిస్తానని వ్యక్తిగతంగా వాగ్ధానం చేస్తున్నాను. మహిపాల్రెడ్డి పారిశ్రామిక ప్రాంతానికి ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కావాలని అడిగారు. ఇవాళనే మంజూరు చేస్తూ జీవో జారీ చేస్తాం. ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి కాలనీలు వస్తున్నయ్. ఇప్పుడే కొల్లూరులో 17వేలపైచీలుకు డబుల్ రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశాం. పటాన్చెరువుకు 2వేల ఇండ్లు కేటాయిస్తున్నాం’ అన్నారు.
‘పటాన్చెరువులు పరిశ్రమలు బాగా నడుస్తున్నయ్. ఒక కండ్ల అద్దాలు తయారు చేసే.. మెడికల్ డివైజెస్ పార్క్ వస్తే.. ఆ ఒక్క పార్కులో 15వేల మంది పని చేస్తున్నారని చెప్పడం సంతోషమనిపిస్తుంది. పటాన్చెరు ఇంకా అభివృద్ధి చెప్పాలి. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీని మంత్రి కేటీఆర్ను పంపిస్తాను. త్వరలో ఐటీ కంపెనీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. భూపాల్రెడ్డి పదేపదే కోరుతున్నారు. రామసముద్రం చెరువు సుందరీకరించి గొప్పగా చేయాలని కోరుతున్నారు. ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు మంజూరు చేయాలని హరీశ్రావుకు సూచిస్తున్నా. సిద్దిపేట కోమటిచెరువు తరహాలో అభివృద్ధి చేస్తాం. కాలనీలు వచ్చిన వెంటనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు. అదనంగా సహాయం కావాలని ఎమ్మెల్యే కోరుతున్నారు. మూడు మున్సిపాలిటీలకు రూ.30కోట్ల నిధులు, మూడు డివిజన్లకు రూ.30కోట్లు కేటాయిస్తున్నాం.
55 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా అభివృద్ధి కోసం సీఎం ఫండ్ నుంచి రూ.15లక్షలు మంజూరు చేస్తున్నాం. ఎప్పటి నుంచే ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతున్నారు. త్వరలోనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తాం. మాజీ సీఎస్ రాజీవ్శర్మకు నేను ధన్యవాదాలు చెప్పాలి. పదవీ విరమణ చేశాక నా కోరిక మేరకు పొల్యూషన్ బోర్డ్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఈ ప్రాంతంలో పొల్యూషన్ రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడ సూపర్ స్పెషల్ హాస్పిటల్ వచ్చేలా రాజీవ్ శర్మ చొరవ చూపారు. మనం కడుతున్న డబుల్ బెడ్రూం ఇండ్లు భారత్లో ఎక్కడా ఉండవ్. మంచినీళ్ల సరఫరా ఎక్కడా కనిపించదు. అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని రాష్ట్రంలో నీళ్ల కరువు లేకుండా మటుమాయం చేసుకున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు.