డయాలసిస్ పేషెంట్లకు ప్రత్యేకంగా ఫించన్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బోదకాలు పేషెంట్లకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మొత్తం 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే.. వాళ్లకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటోందని వివరించారు.
అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సిఫారసు మేరకు డయాలసిస్ పేషెంట్లకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వాళ్లకు బస్ పాసులు ఇస్తున్నామని, ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని, ఇటీవల డయాలసిస్ కేంద్రాలు కూడా పెంచామని తెలియజేశారు. రాష్ట్రంలో 10-12 వేల మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాళ్లకు ఇప్పటి వరకు ఇస్తున్న సేవలతో కలిపి కొత్తగా ‘ఆసరా’ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తద్వారా వారికి నెలకు రూ.2016 ఆర్థిక సాయం అందుతుందని సీఎం చెప్పారు. అలాగే దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇది తమ ప్రభుత్వ పాలసీ అన్నారు. అనాథ పిల్లలను ‘స్టేట్ చిల్డ్రన్’గా ప్రకటించాలని నిర్ణయించామని, దీనిపై కేబినెట్ సబ్ కమిటీ రికమండేషన్లు కూడా ఇచ్చిందని, ఆ నివేదికలు కూడా తనకు ఈ సాయంత్రం అందుతాయని కేసీఆర్ అన్నారు.
దీంతోపాటు అనాథ శరణాలయాలను కూడా ఆదుకుని, ఆ పిల్లల కోసం ప్రత్యేకంగా కేజీ నుంచి పీజీ వరకు స్కూళ్లు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అనాథ పిల్లలను చదివించి, ఉద్యోగాల్లో కూడా వాళ్లకు కొంత రిజర్వేషన్ కల్పించడంతోపాటు గ్రాంట్లు కూడా పెంచాలని నిర్ణయించామన్నారు. విధివంచితులకు ప్రభుత్వమే అండగా ఉండాలనే మానవీయ కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఇవన్నీ కూడా ఉచితాల కిందకే వస్తాయా? అని అడిగారు.