ఆసిఫాబాద్: ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆ జిల్లాల్లోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.25 కోట్ల చొప్పున, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. సీఎం సహాయనిధి నుంచి ఆ నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఆసిఫాబాద్ ప్రగతి నివేదన సభా వేదికపై నుంచే సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, అందులో గిరిజన గ్రామ పంచాయితీలు 162 ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. కాగాజ్నగర్ చాలా పెద్ద మున్సిపాలిటీ అని, ఆసిఫాబాద్ కూడా త్వరలోనే మున్సిపాలిటీగా రూపుదిద్దుకోబోతున్నదని చెప్పారు.
ఆ రెండు మున్సిపాలిటీలకు ముఖ్యమంత్రి నిధుల నుంచి రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నానని సీఎం ప్రకటించారు. అంతేగాక 335 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రటిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు కూడా రూ.25 కోట్ల చొప్పున, 311 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్టు సీఎం చెప్పారు. ఈ నిధులను ఆయా మున్సిపాలిటీల ఛైర్పర్సన్లు, గ్రామ పంచాయతీల సర్పంచులు చక్కగా వినియోగించుకుని మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
సర్పంచ్లకు సెల్యూట్ చేస్తున్నా
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలన్నీ అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయని సీఎం సంతోషం వ్యక్తంచేశారు. ఒకప్పుడు మనిషి చనిపోతే కాల్చడానికి చోటు లేకుండెనని, ఇప్పుడు ఊరూరా వైకుంఠధామాలు వెలిసినయని అన్నారు. దేశంలో 20 గ్రామాలకు జాతీయ అవార్డులు వస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవే ఉంటున్నయని, 10 గ్రామాలకు అవార్డులు వస్తే అందులో 9 గ్రామాలు ఉంటున్నయని సీఎం చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సర్పంచులకు తాను సెల్యూట్ చేస్తున్నానని సీఎం అన్నారు.
ఆసిఫాబాద్లో మరో 86 వేల ఎకరాలకు సాగునీరు తీసుకొస్తా
ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ మరో హామీ ఇచ్చారు. వార్దా నది మీద బ్యారేజ్ మంజూరు అయ్యిందని, ఆ బ్యారేజ్ నీటిలోంచి ఆసిఫాబాద్లో 76 వేల నుంచి 86 వేల ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చే బాధ్యత తనదని, అందుకు తాను హామీ ఇస్తున్నానని సీఎం పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేవలం రెండు నియోజకవర్గాలున్న చిన్న జిల్లా అయినా ప్రగతి నివేదన సభకు జనం ఇంత భారీ ఎత్తున తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే వంద శాతం గెలుపు అనడానికి సభకు విచ్చేసిన జనమే నిదర్శనమని సీఎం పేర్కొన్నారు.
కరెంటు సదుపాయంలో దేశంలోనే నెంబర్ వన్
కరెంటు సదుపాయం కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని నంబర్ వన్ స్థాయిలో ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు కరెంటు సరిగా లేక తెలంగాణ రైతాంగం ఎన్నో తిప్పలుపడ్డదని చెప్పారు. రాత్రిపూట మాత్రమే త్రీఫేజ్ కరెంటు వచ్చేదని, దాంతో రైతులు పొలాలకు నీళ్లు కట్టేందుకు రాత్రిపూట బావులకాడ పండాల్సి వచ్చేదని అన్నారు. రాత్రిపూట మోటార్లు వేయబోయి రైతులు కరెంటు షాక్తో మరణించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని, కానీ, ఇప్పుడు రైతులు రాత్రిపూట బావులకాడ పండుకునే అవసరం లేకుండా రాష్ట్రంలో 24 గంటలు ఉచిత కరెంటు సప్లయ్ అవుతున్నదని చెప్పారు. దేశంలో మరే రాష్ట్రంలో గూడా నయపైసా బిల్లు లేకుండా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న దాఖలాలు లేవని తెలిపారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
తెలంగాణ రాష్ట్రం అనేక అంశాల్లో ముందంజలో ఉందని సీఎం చెప్పారు. తలసరి ఆదాయంలోగానీ, ఇంటింటికి నల్లాలు పెట్టి తాగునీటిని అందించే విషయంలోగానీ తెలంగాణ ముందున్నదన్నారు. గర్భిణీ స్త్రీలకు ఇచ్చే కేసీఆర్ కిట్గానీ, రైతులు చనిపోతే ఇచ్చే రైతు భీమాగానీ, రైతుబంధుగానీ కేవలం తెలంగాణలో మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు రైతు చనిపోతే ఆపద్భందు పథకం పేరుతో రూ.40 వేలో, రూ.50 వేలో ఇచ్చేవాళ్లని, కానీ ఇప్పుడు రైతు చనిపోతే రూ.5 లక్షలు తక్షణమే వారి కుటుంబసభ్యుల ఖాతాల్లో పడుతున్నయని సీఎం చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే రైతుబంధుతో రైతులకు పెట్టుబడి భారం తప్పిందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని, భవిష్యత్తులో ప్రజల మేలు కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చెప్పారు. ఆదివాసీలు, దళితులు, ముస్లిం మైనారీటీలు, బీసీలు తదితర వర్గాల పిల్లల సముద్ధరణ కోసం ప్రభుత్వం గురుకుల పాఠశాలలను నిర్వహిస్తున్నదని, విద్యార్థులందరికీ సన్నబియ్యంతో భోజనం పెట్టిస్తున్నదని సీఎం వెల్లడించారు. గురుకుల పాఠశాలల పిల్లలు కూడా అన్ని రకాల పరీక్షల్లో జాతీయ స్థాయిలో మంచి ఫలితాలను సాధిస్తూ రాష్ట్రానికి మంచి పేరు తెస్తున్నరని ప్రశంసించారు.