హైదరాబాద్: గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కడెం నుంచి భద్రాచలం వరకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేయనున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలిస్తారు. ఏరియల్ సర్వేలో ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొననున్నారు.
ఏరియల్ సర్వేకు సంబంధించిన హెలికాప్టర్ రూటు సహా తదితర విధివిధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి ఫైనల్ చేయనున్నది. కాగా, ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షాసమావేశం నిర్వహిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సంబంధిత కార్యాచరణపై వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.