హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని ప్రతిబింబిస్తుందని, భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. రాఖీతో అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానుబంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. సోదరులంతా తమ అక్కాచెల్లెళ్లపై అనిర్వచనీయమైన ప్రేమను కురిపించడంతోపాటు వారి రక్షణ బాధ్యతలు తీసుకోవాలని కోరారు.
సహోదరత్వానికి ప్రతీక
దేశవ్యాప్తంగా జరుపుకొనే రక్షాబంధన్ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు అనురాగంతో తమ అన్నాదమ్ముల చేతికి రాఖీ కట్టడం గొప్ప సందర్భంగా అభివర్ణించారు. రక్షాబంధన్ సంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని తెలిపారు. ప్రజల్లో సహోదరత్వాన్ని రాఖీపండుగ మరింతగా పెంచుతుందని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.