Telangana | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): దసరా.. దీపావళి.. డిసెంబర్ 31.. న్యూ ఇయర్.. రాష్ట్రంలో ఆబ్కారీ శాఖకు డబ్బుల వర్షం కురిపించే పండుగలు. ఈ సారి డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో మద్యం అమ్మకాల ద్వారా సుమారు 1,000 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు నిబంధనల్లో సడలింపు ఇవ్వనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందుకో సం ప్రతి జిల్లా, ప్రతి డివిజన్కు ప్రత్యేక టార్గెట్లు ఫిక్స్ చేసినట్టు సమాచారం.
ఈ మేరకు కిందిస్థాయి సిబ్బందికి ఎక్సైజ్ ఉన్నతాధికారులు మౌఖిక అదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. లక్ష్యం వెయ్యి కోట్లు కాగా కనీసం రూ.800 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. దసరాకు కూడా ఇదే తరహా ప్రణాళికలు అమలు చేయడంతో కేవలం 11 రోజుల్లోనే రూ.1300 కోట్లు వచ్చాయి. నాడు అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో.. ఈ సారి పకడ్బందీగా టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలిసింది. శనివారం నుంచి బుధవారం లోగా ఐదు రోజుల్లో రూ.1500 కోట్లకు తగ్గకుండా తాగించాలని, ఆ స్థాయిలో ఇప్పటికే అన్ని దుకాణాలకు మద్యం సరఫరా చేస్తున్నట్టు సమాచారం.
ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు బార్లు తెరిచి ఉంచనున్నారు. దీంతో తాగినోళ్లకు తాగినంత మందును విక్రయించే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా క్లబ్లు, పబ్లకు భారీగా మద్యాన్ని తరలించారు. రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. నిరుడు డిసెంబర్లోనే అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఆ నెల చివరి వారంలో మద్యాన్ని ఏరులుగా పారించింది.
కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 28, 29, 30, 31 తేదీల్లో సుమారు రూ.771 కోట్లకు పైగా రాష్ట్ర ఖజానాకు చేరింది. గతేడాది మూడు చివరి దినాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల నుంచి 6.51 లక్షల బీర్ కేసులు, 4.80 లక్షల లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి. 2021 డిసెంబర్లో చివరి నాలుగు రోజుల్లో రూ.600 కోట్ల మద్యం అమ్ముడుపోగా.. 2022లో అది రూ.775 కోట్లకు చేరింది. 2023లో కేవలం చివరి మూడురోజుల్లో రూ.750 కోట్లకుపైగా మద్యం అమ్ముడైంది.
మద్యం అమ్మకాలు జోరుగా సాగేందుకు ఈ సారి బెల్ట్షాపులదే కీలక పాత్ర కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో గ్రామంలో కనీసం 4-10 వరకు బెల్ట్షాపులు ఉండగా.. రోజూ వాటి ద్వారానే భారీగా మద్యం అమ్ముడుపోతున్నది. ఈ క్రమంలో 28వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకూ బెల్ట్షాపులకు ఎలాంటి షరతులు వర్తించబోవని ఉన్నతాధికారులే స్వయంగా చెప్పినట్టు తెలిసింది. గత ప్రభుత్వం ఓ క్రమపద్ధతిలో మద్యం అమ్మకాలు చేపట్టినా కూడా.. ‘తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా చేశారు’ అని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్రెడ్డి ఎన్నోవేదికలపై చెప్పారు.
ఇప్పుడు ఆయన అధికారంలోకి రావడంతోనే ప్రజాపాలన పేరుతో ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఎక్సైజ్శాఖపైనే ఆధారపడ్డారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్రంలోని 60వేలకు పైగా ఉన్న బెల్ట్షాపుల తాట తీస్తానని రేవంత్రెడ్డి చెప్పారు. అధికారంలోకి రాగానే బెల్టుషాపులు ఎత్తివేస్తామన్న హామీని ప్రభుత్వం ఏం చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.