హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బీజేపీకి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని, ప్రజలే దానికి తగిన బుద్ధి చెప్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అదానీపై ప్రధాని మోదీ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ బుధవారం చలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. గాంధీభవన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలను ఖైరతాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పోలీసులు అడ్డుకోవడంపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల సొమ్మును ప్రధాని మోదీ తన ఆప్తమిత్రు డు అదానీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారించాలని డిమాండ్ చేశారు. ఇతర కేసుల్లో ఇష్టారీతిన ఈడీ, ఐటీ, సీబీఐని ఉసిగొల్పుతున్న మోదీ.. అదానీ అంశంపై ఎందుకు వాటితో విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు.