హైదరాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( CS Shanti Kumari) తెలిపారు. వజ్రోత్సవ ముగింపు వేడుకల ఏర్పాట్లపై డాక్టర్ బీఆర్ అంబ్కేదర్ సచివాలయంలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణా చారి, దేశపతి శ్రీనివాస్, డీజీపీ అంజనీ కుమార్లతో కలిసి సీఎస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ హెచ్ఐసీసీలో జరిగే వజ్రోత్సవ (Independence India Diamond Jubilee ) ముగింపు ఉత్సవానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR ) ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల అధ్యక్షులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారని వివరించారు.
సుమారు గంటసేపు దేశ భక్తి, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programmes) ఉంటాయని తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ సందేశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ వజ్రోత్సవ ముగింపు వేడుకలకు పటిష్ట నిఘా, పకడ్బందీ ( Security) ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను (Police Officers) ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, సందీప్ సుల్తానియా, జితేందర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.