Monsoon | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడుతున్నది. ఈ కారణంగా లక్ష దీవులను ఇప్పటికీ దాటని రుతు పవనాలు అరేబియా సముద్రంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనంతో అనుకున్నదాని కంటే కాస్త ముందుగానే కేరళ తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తున్నది. అంటే జూన్ 8 లేదా 9న నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో జూన్ 15వ తేదీ వరకు వర్షాలు పడకపోవచ్చని అధికారులు వెల్లడించారు. రుతుపవనాల ఆలస్యంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయిదు శాతం వరకూ వర్షపాతం తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈనెల 9వ తేదీ వరకు వడగాల్పులు వీస్తాయని తెలుపుతూ వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టు రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
అరేబియా సముద్రంలో అల్పపీడనం
ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. గుజరాత్లోని పోరుబందర్ దక్షిణ దిశలో 1190 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నది. వాయవ్యం దిశగా ఈ అల్పపీడనం పయనిస్తున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. ఈ అల్పపీడనం తుఫానుగా మారే సూచనలు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. దీనికి బిపార్జాయ్గా నామకరణం చేయనున్నట్టు అధికారులు వివరించారు. గురువారం ఉదయానికి తుఫానుగా మారి, శుక్రవారం నాటికి తీవ్ర తుఫానుగా పరిణమించే అవకాశం ఉన్నట్టు వారు తెలిపారు. తుఫాను ప్రభావంతో నైరుతి రుతు పవనాలు కాస్త ముందే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు.