హైదరాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ) : వీఆర్ఎస్(వాలంటరీ రిటర్మైంట్) విషయంలో ఆర్టీసీ కార్మికుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని రీజినల్ మేనేజర్ల (ఆర్ఎం)కు సంస్థ చీఫ్ పర్సనల్ మేనేజర్ యుగంధర్ సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్ఎస్ అనంతరం పొందే సెటిల్మెంట్స్పై స్పష్టత ఇస్తూ సవివర నోట్ను విడుదల చేశారు. గ్రాట్యూటీ, పీఎఫ్, ఉద్యోగుల పింఛన్, లీవ్ ఎన్కాష్మెంట్, శాలరీ సెటిల్మెంట్, బస్పాస్ సౌకర్యం, ఆర్పీఎస్ బాండ్ అమౌంట్ తదితర అంశాల గురించి అందులో ప్రస్తావించారు. పదేండ్ల సర్వీసు పూర్తి చేసిన కార్మికులు వీఆర్ఎస్ తీసుకొంటే వారికి ప్రతి నెలా రూ.1000 పింఛన్, మిగిలి ఉన్న సర్వీసు ఆధారంగా అదనపు మానిటరీ బెనిఫిట్స్ వర్తిస్తాయి. సిటీ సబ్-అర్బన్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, డీలక్స్ అండ్ డిస్ట్రిక్ బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణంతో సూపర్ లగ్జరీలో 50శాతం రాయితీ ఉంటుంది. ఉద్యోగి మరణానంతరం వారి భార్య లేదా భర్తకు బస్సుపాస్ సౌకర్యం కల్పిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రెండు రాష్ర్టాల ఎండీల భేటీ
హైదరాబాద్లోని బస్భవన్లో సోమవారం ఏపీ, తెలంగాణ ఆర్టీసీ సంస్థల ఎండీలు భేటీ అయ్యారు. సంస్థ విభజన అనంతర పరిణామాలు, ఇంటర్స్టేట్ సర్వీసులపై సుదీర్ఘీంగా చర్చించారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఏపీ ఎండీ తిరుమల రావుతో పాటు ఇరు రాష్ర్టాల ఈడీలు సమావేశంలో పాల్గొన్నారు.