హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): చనాకా-కొరాట, చౌటుపల్లి హన్మంతరెడ్డి, చిన్న కాళేశ్వరం (ముక్తీశ్వర) ఎత్తిపోతల పథకాల అనుమతులకు మార్గం సుగమం అయింది. ఇప్పటికే సీడబ్ల్యూసీ నుంచి అన్ని క్యాటగిరీల్లో ఆమోదం పొందిన ఆయా ప్రాజెక్టుల డీపీఆర్లకు తాజాగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ అభ్యంతరాలను తిరస్కరిస్తూ డీపీఆర్లను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ)కి పంపేందుకు బోర్డు అంగీకరించింది. జీఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ నేతృత్వంలో బోర్డు 13వ సమావేశం జలసౌధలో బుధవారం ఉదయం కొనసాగింది. ప్రధానంగా పై మూడు ప్రాజెక్టులపై చర్చించిన ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పాత పాటే పాడింది. ఆయా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవని, గోదావరిలో నీటి లభ్యతపై పూర్తిస్థాయిలో అధ్యయనం జరిపేందుకు ట్రిబ్యునల్ను వేయాల్సిందిగా కేంద్ర జల్శక్తిశాఖను బోర్డు కోరాలని పేర్కొన్నది.
నీటి కేటాయింపులు పూర్తయ్యే వరకు డీపీఆర్లను టీఏసీకి పంపవద్దని వాదించింది. దీనిని తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికీ గతంలోనే సమాధానం ఇచ్చామని, సీడబ్ల్యూసీ సైతం వాటిని పరిశీలించాకే అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. ఫ్లో చార్ట్ ప్రకారం డీపీఆర్లపైనే బోర్డు చర్చ జరపాలని, ఇరు రాష్ర్టాల అభిప్రాయాలతో నోట్ తయారుచేసి విధిగా టీఏసీకి పంపాలని తెలిపారు. నోట్ను పెండింగ్లో పెట్టుకొనే అధికారం బోర్డుకు లేదని తేల్చిచెప్పారు. ఈ వాదనతో బోర్డు చైర్మన్ ఏకీభవించారు. తెలంగాణ సమర్పించిన డీపీఆర్లను టీఏసీకి పంపిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఇక ఈ మూడు ప్రాజెక్టులకు టీఏసీ అనుమతులే మిగిలి ఉన్నాయి.
సబ్ కమిటీ సభ్యునిగా శ్రీధర్రావు దేశ్పాండే
జీఆర్ఎంబీ సబ్ కమిటీ సభ్యుడిగా సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే నియమితులయ్యారు. గతంలోనే జరిగిన ఈ నియామకాన్ని బోర్డు బుధవారం ఆమోదించింది. బోర్డులో ఎస్ఈగా భీమ్ప్రసాద్ నియామకానికి కూడా జీఆర్ఎంబీ ఆమోదం తెలిపింది. సమావేశంలో రామగుండం ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లు, సబ్ కమిటీ మెంబర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్రెడ్డి, నిజామాబాద్ సీఈ మధుసూదన్రావు, తెలంగాణ అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు, ఈఈ సుబ్రహ్మణ్యప్రసాద్, ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిధులైనా, ఉద్యోగులైనా కేంద్రం స్పష్టత ఇచ్చాకే..
బోర్డు సమావేశంలో సీడ్ మనీ, ఉద్యోగుల అప్పగింత తదితర అంశాలపై కూడా చర్చ జరిగింది. గెజిట్ ప్రకారం ఇరు రాష్ర్టాలు ప్రాజెక్టుల నిర్వహణ కోసం రూ.200 కోట్ల చొప్పున జీఆర్ఎంబీకి సమకూర్చాల్సి ఉంది. దీనిని వెంటనే సమకూర్చాలని బోర్డు చైర్మన్ కోరాగా, అందుకు తెలంగాణ, ఏపీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఏ ప్రాతిపదికన, దేనికోసం ఎంత ఖర్చు చేస్తారో వివరంగా చెప్పకుండా సీడ్ మనీ నిధులు జమచేయాలని కోరడమేంటని ప్రశ్నించాయి. ఖర్చుపై వివరణ ఇవ్వనిదే తమ ఆర్థిక శాఖలు నిధులను విడుదల చేయబోవని రెండు రాష్ర్టాలు ఒకే వాదన వినిపించాయి. జ్యురిస్డిక్షన్ ఇంకా అమలులోకి రానందున ప్రస్తుతానికి సీడ్ మనీ విషయాన్ని వాయిదా వేయాలని సూచించాయి.
గతంలో రూ.4.5 కోట్లుగా ఉన్న వార్షిక బడ్జెట్ను ఈసారి రూ.17 కోట్లకు పెంచాలని బోర్డు చేసిన ప్రతిపాదనను సైతం ఇరు రాష్ర్టాలు తిరస్కరించాయి. గోదావరిలో కేవలం పెద్దవాగు ప్రాజెక్టు మాత్రమే ఉమ్మడిగా ఉన్నదని, దాన్ని తప్ప మరే ప్రాజెక్టునూ బోర్డుకు అప్పగించేది లేదని పేర్కొన్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్రానికి విన్నవించామని, అక్కడి నుంచి స్పష్టత వచ్చే వరకు బడ్జెట్ను పెంచేది లేదని స్పష్టం చేశాయి. తెలంగాణ, ఏపీ నుంచి డిప్యూటేషన్పై బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు అలాగే కొనసాగుతారని, వారిని పూర్తిగా బోర్డుకే పరిమితం చేయబోమని తెలిపాయి.