హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఒకే విడతలో మూడు లేదా ఐదేండ్ల పాటు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఇంటర్బోర్డు ప్రయత్నిస్తున్నది. తాజాగా అఫిలియేషన్ల (అనుబంధ) జారీ ప్రక్రియ కొనసాగుతుండగా, ఇప్పటికిప్పుడు ఈ ఒక్క ఏడాదికే అనుమతిస్తారు. ఆ తర్వాత కాలేజీల నుంచి తగు ఫీజులు స్వీకరించి మూడు లేదా ఐదేండ్లకు గుర్తింపును జారీచేస్తారు. 2023 -24 విద్యాసంవత్సరానికి కాలేజీలకు అఫిలియేషన్ల జారీ ప్రక్రియను ఇంటర్బోర్డు రెండు మూడు రోజుల్లో పూర్తిచేయనున్నది. ఈ ఏడాది 3,111 కాలేజీలు దరఖాస్తులు సమర్పించగా, ఇప్పటికే 1,030కి పైగా కాలేజీలకు అనుమతులిచ్చారు.1,500కు పైగా కాలేజీలు ఫీజు చెల్లించగా వీటికి కూడా త్వరగా గుర్తింపు ఇవ్వాలని ఇంటర్బోర్డు లక్ష్యంగా పెట్టుకొన్నది. ఈ ఏడాది మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు ఫైర్ ఎన్వోసీ లేకుండా అనుమతులిస్తున్నామని ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ తెలిపారు. వచ్చే ఏడాది ఫైర్ ఎన్వోసీ ఉంటేనే అనుమతులిస్తామని స్పష్టంచేశారు. అఫిలియేషన్ పొందని కాలేజీలపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభిస్తామని నవీన్మిట్టల్ పేర్కొన్నారు.