హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 14 : ఎన్నికలకు ముందే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఆ పార్టీ అధిష్ఠానానికి ఇప్పటికే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు తలనొప్పిగా మారగా.. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా ఏర్ప డి ఎవరికి వారు వేర్వేరుగా పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురవుతున్నారు.
ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బల్మూరి వెంకట్ తనకే టికెట్ వస్తుందని జమ్మికుంట రోడ్డులోని పాత ఎక్సైజ్ కార్యాలయానికి రంగులు వేయించి పార్టీ జెండాలు కట్టి కొత్తగా ఆఫీసు ఏర్పాటు చేశారు. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన వొడితల ప్రణవ్ మున్సిపల్ కార్యాలయం పకన గల పాత బీఆర్ఎస్ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారు. ఎవరికి వారు పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడంతో కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురవుతున్నారు. అంతకుముందే కూరగాయల మారెట్ పకన గూడూరు స్వామిరెడ్డి గెస్ట్హౌస్ను కాంగ్రెస్ కార్యాలయంగా ప్రకటించుకొని పలు సభలు, ప్రెస్మీట్లు పెట్టారు. ఒకే పార్టీకి 3 చోట్ల పార్టీ కార్యాలయాలు ఉండటాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు.