నస్రుల్లాబాద్, జనవరి 1: పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఏర్పాటుచేసిన వేడుకలు విషాదం నింపాయి. డీజే పాటల విషయంలో తలెత్తిన ఘర్షణ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. ఎస్సై లావణ్య, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం… కాంగ్రెస్ పార్టీ నాచుపల్లి గ్రామ అధ్యక్షుడు సాదుల రాములు (45), గ్రామానికి చెందిన జెల్ల సాయికుమార్, గంపల సుధాకర్, మొండి భాస్కర్, కొప్పుల దివ్య తదితరులు ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన డీజే పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కీసరి రవి, కొంగల అనిల్, కొంగల గోపాల్, కొంగల వినోద్ వారి వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పాటలు పెట్టాలని కోరారు. ఇది గమనించిన సాదుల రాములు, విఠల్, భూమయ్య, సాయిలు, హన్మాండ్లు, జెల్ల సాయికుమార్, గైని సాయిలు కలుగజేసుకొని వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు.
దీంతో గోపాల్.. సాదుల రాములును దుర్భాషలాడుతూ, చంపేస్తామని బెదిరిస్తూ వెనుదిరిగాడు. కాసేపటికి రాములు ప్రైమరీ పాఠశాల వైపు నుంచి వెళ్తుండగా, అక్కడే ఉన్న కీసరి రవి, అనిల్, గోపాల్, వినోద్ ఒక్కసారిగా అతడిపై దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని డీఎస్పీ జగన్నాథరెడ్డి హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత చలసాని సుధీర్ అండ చూసుకొని తన భర్తను హత్య చేశారని, అతడితోపాటు నిందితులపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.