హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ బలమైన నాయకత్వ వ్యూహంతోనే సింగరేణిని ప్రైవేటీకరించే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందని సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులను అప్రమత్తం చేసి కేంద్రం కుట్రలను తిప్పికొట్టిన ఫలితంగానే, రామగుండంలో సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన లేదని మోదీ జవాబిచ్చారని గుర్తుచేశారు. మోదీతో ఆ ప్రకటన చేయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీలో విప్ ఎమ్మెస్ ప్రభాకర్, ఎంపీ వెంకటేశ్నేత, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి కొప్పుల మీడియాతో మాట్లాడుతూ..
రామగుండంలో సింగరేణిపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అనివార్యత కల్పించిన బలమైన నేతగా సీఎం కేసీఆర్ను దేశం గుర్తిస్తున్నదని తెలిపారు. మోదీ ఈ పర్యటనను రాజకీయ పర్యటనగా మార్చుకున్నారని, అబద్ధాలు మాట్లాడి ప్రజలను తప్పుదారి పట్టించారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం విక్రయిస్తూ ఎస్టీ, ఎస్టీ రిజర్వేషన్లకు గండికొడుతున్నదని, 8.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ బలమైన నాయకత్వం కారణంగానే ఏపీ తరహాలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడంలేదని, సింగరేణి ప్రైవేటీకరణ ఆగిందని తెలిపారు. రాష్ట్రంలో 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ప్రైవేట్రంగంలో దాదాపు 14 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని, ఈ వాస్తవాలను యువత గ్రహించాలని అన్నారు.
ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు: వెంకటేశ్ నేత
రామగుండం కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీని ఆహ్వానించి, స్థానిక ఎంపీనైన తనను ఆహ్వానించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించటంపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని వెంకటేశ్ నేత పేర్కొన్నారు. ప్రధాని వస్తున్నప్పుడు పీఎంవో నుంచి సీఎంవోకు పర్యటన వివరాలు, ఆహ్వాన పత్రాలు వస్తాయని.. రామగుండం విషయంలో ఇవేవీ పాటించలేదని ఆరోపించారు. గుజరాత్ లిగ్నైట్ కార్పొరేషన్కు బొగ్గు బ్లాకులు అప్పగించారని, నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.