లక్ష్మీ బరాజ్ పరిస్థితిపై మీడియాలో వస్తున్న కథనాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్జైన్ నేతృత్వంలోని అధికార బృందం విస్మయాన్ని వ్యక్తంచేసింది. లక్ష్మీ బరాజ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన బృందం.. ప్రాజెక్టుల నిర్మాణాల్లో చిన్న సాంకేతిక సమస్యలు సహజమేనని పేర్కొంటూ, గతంలో పలు ప్రాజెక్టుల్లో తలెత్తిన సమస్యలను ఉదహరించింది.
Medigadda Barrage | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల నిర్మాణంలో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు సహజమేనని, మేడిగడ్డ (లక్ష్మీ బరాజ్) 7వ బ్లాకులోని 20వ పియర్ కుంగుబాటుపై అంతగా ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్జైన్ నేతృత్వంలోని అధికార బృందం స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. కేంద్ర జల్శక్తి శాఖ నియమించిన ఈ బృందం ఇప్పటికే లక్ష్మీ బరాజ్ను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించింది. అనిల్జైన్తోపాటు ఈ బృందంలో సభ్యులుగా ఉన్న కే శర్మ, ఆర్ తంగమణి, రాహుల్ కే సింగ్, దేవేందర్రావు, కేజీబీవో నామినేట్ చేసిన ఇద్దరు సభ్యులు బుధవారం జలసౌధలో రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఈఎన్సీ నాగేందర్రావుతోపాటు, ఈ బరాజ్ను నిర్మించిన ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బరాజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలన్నింటినీ వివరంగా అడిగి తెలుసుకున్నారు. నిర్మాణానికి ముందు చేపట్టిన పరీక్షలను, నిర్మాణం చేసిన విధానం, అందుకు వినియోగించిన యంత్ర పరికరాలకు సంబంధించిన అంశాలపైనా ఆరా తీయడంతోపాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరింత సాంకేతిక సమాచారాన్ని కోరినట్టు సమాచారం. వాటన్నింటినీ క్రోడీకరించి కేంద్ర జల్శక్తి శాఖకు ప్రాథమిక నివేదిక అందిస్తామని ఈ బృందం వెల్లడించినట్టు తెలుస్తున్నది. నీటి ప్రవాహం తగ్గాక బరాజ్ పునాది స్థాయిలో మరిన్ని పరీక్షలను నిర్వహించాల్సి ఉన్నదని, ఆ తర్వాత పునరుద్ధరణ పనులకు తగిన సిఫారసులు చేస్తామని తెలిపినట్టు సమాచారం.
కుంగుబాటు స్వల్పమే..
లక్ష్మీ బరాజ్ పరిస్థితిపై మీడియా వస్తున్న కథనాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదని విస్మయాన్ని వ్యక్తం చేసిన కేంద్ర బృందం.. ప్రాజెక్టుల నిర్మాణాల్లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు సహజమేనని పేర్కొనడంతోపాటు గతంలో పలు ప్రాజెక్టుల్లో తలెత్తిన సమస్యలను ఉదహరించినట్టు తెలుస్తున్నది. వాటితో పోల్చినప్పుడు ప్రస్తుతం లక్ష్మీ బరాజ్ కుంగుబాటు స్వల్పమేనని, అది కూడా ఒకవైపు మాత్రమేనని అభిప్రాయపడినట్టు అధికారులు చర్చించుకుంటున్నారు.