Lok Sabha Elections | ఖమ్మం, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కొద్దినెలల క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, ఆమె రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఆ అవకాశం లేదని తేలిపోయింది. ఖమ్మం టికెట్ కోసం భారీ సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నారు. జిల్లాలోని మధిర నియోజకవర్గం నుంచి 2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లు భట్టివిక్రమార్క ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాతోపాటు కీలకమైన ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
అధిష్ఠానం వద్ద మంచిపేరు తెచ్చుకున్న భట్టి విక్రమార్క ఇప్పుడు తన సతీమణి నందినికి టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాకే చెందిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేంధర్ కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే అనువైన సమయమని భావిస్తూ టికెట్ దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు సమాచారం.
వీరితోపాటు జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరున్న వంకాయలపాటి రాజేంద్రప్రసాద్తోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు (వీహెచ్) కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తనకు టికెట్ ఎందుకు ఇవ్వరంటూ వీహెచ్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించినట్టు వార్తలొచ్చాయి. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కూడా తన ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది.
పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు జావీద్కు టికెట్ ఇవ్వాలంటూ మైనార్టీ వర్గానికి చెందిన పలువురు నేతలు కొద్దిరోజులుగా ఖమ్మం జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు. వీరితోపాటు జిల్లావాసి అయిన ఒక మీడియా సంస్థ అధినేత కూడా ఖమ్మం ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు జిల్లాలో చర్చ నడుస్తున్నది. ఢిల్లీ స్థాయిలో కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉండటం, జిల్లాలో సామాజికవర్గ సమీకరణలు ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు. చివరకు పార్టీ అధిష్ఠానం ఎవరికి, ఏ ప్రాతిపదికన, ఏ సమీకరణలతో టికెట్ ఇస్తుందో చూడాలి మరి.