హైదరాబాద్ : నల్సార్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం ఆదివారం జరిగింది. కార్యక్రమానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై, న్యాయ విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, బర్కత్పురాలో చిన్న భవనంలో ప్రారంభమైన కళాశాల నేడు అత్యున్నత స్థాయికి ఎదిగిందన్నారు. పేదలు, సామాన్యులకు న్యాయం అందడమే లక్ష్యం కావాలని యువ న్యాయ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
భాష ఏదైనా సమాచార మార్పిడి సమర్థంగా ఉండాలని సూచించారు. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాహిత్యం, చరిత్ర తెలిసి ఉండాలని సూచించారు. అంతిమంగా నిజం రాబట్టడానికి ప్రశ్నించేతత్వాన్ని మరవొద్దని హితవు పలికారు. న్యాయవిద్యార్థులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తమ శక్తిని వినియోగించుకునే మార్గమే యువత భవిష్యత్ను నిర్దేశిస్తుందన్నారు. న్యాయ సమానత్వం కోసం న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు.