ధర్మారం, ఫిబ్రవరి 5: ప్రజల నమ్మకాన్ని కాపాడేలా న్యాయ వ్యవస్థ కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సూచించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పొనుగోటి నవీన్రావు, జస్టిస్ శ్రవణ్కుమార్తో కలిసి సీజే ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ఉజ్జల్ భూయా న్ మాట్లాడుతూ.. ప్రజల్లో న్యాయ వ్యవస్థపై మరింత గౌరవం పెంచేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. తనకు తెలుగు భాషంటే ఎంతో ఇష్టమన్న సీజే.. మాజీ సీఎం ఎన్టీఆర్ మాట్లాడే తెలుగు ఎంతో ఆకర్షణీయంగా ఉండేదని తెలిపారు. కోర్టుల్లో స్థానిక భాష వాడితే న్యాయవ్యవస్థ ప్రజలకు మరింత చేరువవుతుందని అభిప్రాయపడ్డారు. ముంబై హైకోర్టులో స్థానిక మరాఠీ భాషలో కోర్టు ప్రొసీడింగ్స్ ప్రచురించడం వల్ల అక్కడి ప్రజలకు న్యాయ వ్యవస్థ మరింత దగ్గరైందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం : సీజే
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా ఉన్నదని హైకోర్టు సీజేతోపాటు న్యాయమూర్తులు కొనియాడారు. రైతుల మేలు కోసం ఇంత గొప్ప ప్రాజెక్టు నిర్మించడం గొప్ప విషయమని ప్రశంసించారు. నందిమేడారంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించిన అనంతరం హై కోర్టు న్యాయమూర్తులు నవీన్రావు, శ్రవణ్కుమార్, టీ వినోద్ కుమార్, ఏ అభిషేక్ రెడ్డి, కే కైలాశ్మన్, బీ విజయ్సేన్రెడ్డి, ఎం లక్ష్మణ్, కే సురేందర్, ఎం సుధీర్కుమార్, సీవీ భాస్కర్రెడ్డి, ఈవీ వేణుగోపాల్, నాగేశ్ భీమపాక, పుల్ల కార్తీక్, కే శరత్, జే శ్రీనివాస్రావుతో కలిసి సీజే జస్టిస్ భూయాన్ కాళేశ్వరం ప్రాజెక్ట్లోని ఆరో ప్యాకేజీలో భాగంగా నిర్మించిన నంది పంప్హౌస్ను సందర్శించారు. సర్జ్ఫూల్, జీఐఎస్ సబ్స్టేషన్, మోటర్లను పరిశీలించారు. మోటర్లను ఆన్ చేయగా డెలివరీ సిస్టర్న్స్ నుంచి ఎగిసిపడ్డ జలాలను చూసి పులకించిపోయారు. నీటిపరవళ్లను చూస్తే సంతోషంగా ఉన్నదని చెప్పారు. రైతుల కోసం ఇంత గొప్ప నీటిపారుదల ప్రాజెక్టు నిర్మించడం అభినందనీయమని సీజేతోపాటు న్యాయమూర్తులు అన్నారు.