హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): పౌరసరఫరాల సంస్థ ఆదాయం పెంచుకొనే మార్గాలను అన్వేషించాలని సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 32 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆ తర్వాత ప్రతి జిల్లాలో ఎల్పీజీ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్కుమార్తో కలిసి గురువారం సంస్థ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
రవీందర్సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 3 పెట్రోల్ బంకులు, 11 ఎల్పీజీ సెంటర్లతో సంస్థకు ఏడాదికి రూ.5 కోట్ల ఆదాయం వస్తున్నదని, రాబోయే రోజుల్లో రూ.20 కోట్లకు చేరుకొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వేల కోట్ల సబ్సిడీ భారాన్ని భరించి సీఎం కేసీఆర్ పేదలకు రూపాయికే కిలో బియ్యాన్ని అందిస్తున్నారని.. అర్హులకే బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బియ్యం అక్రమరవాణా, రీసైక్లింగ్కు చెక్ పెట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మధ్యాహ్న భోజనానికి అందించే బియ్యం నాణ్యతను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని జిల్లా మేనేజర్లకు సూచించారు. గోదాములు, రైస్ మిల్లుల్లో విధిగా 10 నుంచి 50 మొకలు నాటి, సంరక్షించాలని కోరారు.