హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రైతులకు ధాన్యం డబ్బులను రెండు రోజుల్లోనే చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 7,149 కేంద్రాలకు గానూ ఇప్పటికే 6,919 కేంద్రాలను ప్రారంభించి 1.87 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, ఏర్పాట్లపై శనివారం ఆయన సివిల్సైప్లె భవన్లో విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం తీసుకొచ్చిన ధాన్యానికి కచ్చితంగా మద్దతు ధర దక్కేలా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు పచ్చి ధాన్యాన్ని తీసుకురాకుండా ఆరబెట్టి, తూర్పారబట్టి 17 శాతం తేమ మించకుండా తీసుకురావాలని కోరారు.
కొనుగోలు కేంద్రాల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జూన్ 30 వరకు కొనుగోలు కేంద్రాలు ఉంటాయని వివరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద, మిల్లుల్లో తాలు, తేమ పేరుతో కోతలు పెడితే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రంలో ఎంత తూకం వేస్తే అంతే మొత్తం ట్రక్షీట్లో ఉండాలని, మిల్లుల వద్ద కోత పెట్టొద్దని ఆదేశించారు. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు ఇప్పటికే ఐకేపీ కేంద్రాల నిర్వహకులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. తాను కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు వంటి పరికరాలను అందుబాటులో ఉంచినట్టు వివరించారు. గన్నీ సంచులకు ఎలాంటి కొరత లేదని చెప్పారు.
ఇతర రాష్ర్టాల ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా, ఇక్కడి బియ్యం ఇతర రాష్ర్టాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు 56 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్టు డీఎస్ చౌహాన్ తెలిపారు. డిఫాల్ట్ మిల్లర్ల నుంచి డబ్బును రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. మిల్లింగ్ ఇండస్ట్రీ కూడా ఇబ్బందుల్లో ఉందని, వారి సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే వారికి అందాల్సిన రూ. 900 కోట్ల ట్రాన్స్పోర్ట్ బకాయిలను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. 90 శాతం మిల్లర్లు నిబంధనల ప్రకారం ఉండగా, మిగిలిన మిల్లర్లు అవకతవకలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మంచిగా ఉండే మిల్లర్లకు సహకరిస్తామని, నిబంధనలు అతిక్రమించే మిల్లర్లపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఈ సీజన్లో మొత్తం 75 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 5 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గడం, కొంత పంట నష్టపోవడంతో ఆ లక్ష్యానికి తగ్గట్టు రాకపోవచ్చని తెలిపారు.