హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఏపీకి కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదంపై హైకోర్టు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. డీజీపీ అంజనీకుమార్ సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులు, 9 మంది ఐఏఎస్ అధికారుల కేటాయింపులను రద్దుచేస్తూ గతంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టీ తుకారాంజీతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్కుమార్ను ఏపీకి కేటాయించడం సబబేనంటూ ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రస్తుతం తమ ముందున్న 12 మంది అధికారులందరికీ వర్తించదని స్పష్టం చేసింది.
ఆ అధికారుల పిటిషన్లపై విడివిడిగా విచారణ జరుపుతామని ప్రకటించింది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సుల మేరకు ఉమ్మడి రాష్ట్రంలోని సెంట్రల్ సర్వీస్ అధికారులను తెలంగాణ, ఏపీకి విభజించిన విషయం విదితమే. దీనికి వ్యతిరేకంగా 15 మంది అధికారులు క్యాట్ నుంచి ఉత్తర్వులు పొంది కోరుకున్న రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేసిన సోమేశ్కుమార్ ఏపీ క్యాడర్ అధికారేనని ఇటీవల హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు. మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు (రంగనాథ్, సంతోష్ మెహ్రా) తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలినవారిలో డీజీపీ అంజనీకుమార్, మరో ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్త్, ఐఏఎస్లు రోనాల్డ్ రాస్, అనంతరాములు, ఎస్ఎస్ రావత్, కే ఆమ్రపాలి, శ్రీజన గుమ్మల, హరికిరణ్, శివశంకర్ లహోటి, పదోన్నతి పొందిన ఐఏఎస్లు ప్రశాంతి, వాకాటి కరుణ, వాణిప్రసాద్లకు అనుకూలంగా 2016 మార్చి 29న క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో కేంద్రం వేర్వేరు వ్యాజ్యాలను దాఖలు చేసింది. వీటిపై ఈ నెల 27న రెగ్యులర్ బెంచ్ విచారణ జరుపుతుందని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.