హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ పేరుతో అమాయక ప్రజలను మోసగించి రూ.కోట్లు దోచుకుంటున్న ఘరానా నేరస్థుడిని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శనివారం బంజారాహిల్స్లోని ఐసీసీసీలోని నగర పోలీస్ కమిషనరేట్లో సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. హర్యానాకు చెందిన హితేశ్ గోయల్(36) ‘డఫాబెట్’ తదితర ఆన్లైన్ గేమింగ్ నిర్వాహకులతో కుమ్మక్కై అమాయక ప్రజలను మోసగిస్తున్నాడు. ఇందుకోసం ఢిల్లీలో ఒక ఆఫీస్ను ఏర్పాటుచేసి అక్కడి నుంచి ఆన్లైన్ గేమింగ్ మోసాలకు పాల్పడుతున్నాడు.
పలువురు అమాయక ప్రజల బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు వ్యాపారుల ఐడీలను తస్కరించి, వాటిని దుబాయ్లోని తన స్నేహితుడు సంజీవ్తో పాటు హాంకాంగ్, ఫిలిప్పీన్స్, చైనాలోని సైబర్ నేరగాళ్లకు చేరవేసి అక్రమ లావాదేవీలను నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలోనే సో మాజిగూడకు చెందిన ఒక వ్యక్తిని డఫాబెట్. కామ్ గేమ్ వెబ్సైట్ ద్వారా ఆకర్షించి బాధితుడి వద్ద నుంచి 70 లక్షలు కొట్టేశాడు. గే మింగ్ ద్వారా ఎలాంటి లాభాలు రాకపోవటంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సైబర్క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద 1.40 కోట్ల నగదు, 23 మొబైల్ ఫోన్లు, మూడు హార్డ్ డిస్క్లు, రెండు ల్యాప్టాప్లు, 36 బ్యాంక్ చెక్బుక్స్, 52 డెబిట్ కార్డ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
సైబర్క్రైమ్, సిట్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్, సైబర్ క్రైమ్స్ డీసీపీ డీ కవిత, ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ హరిభూషన్రావు, ఎస్సై సురేశ్, హెచ్సీ వీ నర్సింగ్రావు, పీసీ జీ గోవిందరావు, బీ రవిశంకర్, జీ వెంకటేశ్, సీహెచ్ రాజేష్కుమార్, ఏ రాము, ఎన్ వంశీ కేసును ఛేదించినట్టు సీపీ తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.