కలెక్టరేట్, మార్చి 5: కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల సమస్యలు పరిష్కరించాలని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇప్పించి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని నేతన్నలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్లలోని కొత్త బస్టాండ్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నేత కార్మికులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ.. ఈ నెల 7న సీఎం రేవంత్రెడ్డి సిరిసిల్ల పర్యటనకు వస్తున్న సందర్భంగా వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించాలని కోరారు.
బతుకమ్మ చీరలు, ప్రభుత్వరంగ సంస్థల వస్ర్తాలన్నింటికీ ఆర్డర్లు తమకే ఇవ్వాలని, వర్కర్ టూ ఓనర్ పథకాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం సీఐటీయూ తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌళిశాఖ ఆఫీస్ ఎదుట ఉదయం 10 గంటలకు ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. అన్ని రంగాల కార్మికులు, ఆసాములు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.