హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో సెల్ఫోన్ స్నాచింగ్ చేసి సూడాన్ దేశానికి తరలిస్తున్న అంతర్జాతీయ సెల్ఫోన్ చోరీ ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సూడాన్ దేశస్థుడితోపాటు 30 మంది హైదరాబాద్కు చెందిన ముఠా సభ్యులను అరెస్టుచేసి వారి నుంచి రూ.2 కోట్ల విలువైన 713 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీపెరుమాల్ ఆదివారం మీడియాకు వెల్లడించారు.
నగరంలో మొబైల్ ఫోన్ స్నాచింగ్లు, సెల్ఫోన్ దోపిడీ, సెల్ఫోన్ కోసం హత్యలు కూడా జరుగుతున్నాయి. సెల్ఫోన్ దోపిడీ ముఠాలపై నిఘా పెట్టి కొన్ని రోజుల క్రితం ఒక ముఠాను అరెస్టు చేశారు. తాజాగా ఇదే తరహాలో సౌత్, ఈస్ట్, సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ టీమ్లు రంగంలోకి దిగి మరో భారీ నెట్వర్క్ను ఛేదించారు. హైదరాబాద్లో సెల్ఫోన్ స్నాచింగ్ చేసి సెల్ఫోన్ మరమ్మతులు చేసే దుకాణాలకు విక్రయిస్తుంటారు.
అక్కడుండే టెక్నీషియన్స్ కొన్ని సెల్ఫోన్లను ధ్వంసం చేసి, ఆ ఫోన్ విడిభాగాలను అమ్మేస్తుంటారు, మరికొందరు సెల్ఫోన్ ఐఎంఈఐ నంబర్ను కూడా మార్చేసి విక్రయిస్తున్నారు. ఈ ఫోన్లను సూడాన్ దేశస్థుడు కొనుగోలు చేసి వాటిని అక్రమంగా తమ దేశానికి తరలిస్తుంటారు. అరస్టైయిన వారిలో స్నాచింగ్ చేసే వారితోపాటు టెక్నీషియన్స్, ఆయా సెల్ఫోన్లను కొనుగోలు చేసి విదేశాలకు తరలిస్తున్న సూడాన్ దేశస్థుడు ఉన్నారు. తాజాగా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన 27 కేసులు ఛేదించారు.
అరస్టైయిన ముఠా సభ్యులు
ఓల్డ్సిటీకి చెందిన మహ్మద్ అమ్జద్, సయ్యద్ గయాజ్ హస్మీ, షేక్ అన్సర్, మహ్మద్ ముజఫర్, మహ్మద్ ఖలీద్, మహ్మద్ దస్తగిరి, మహ్మద్ హమీర్, అహ్మద్ మహమూద్ అలీ, సోహెల్ ఖాన్, మహ్మద్ఖాన్, షేక్ మున్వార్, సయ్యద్ సాజీద్ అలియాస్ చాపల్ సాజిద్, సయ్యద్ షరీఫ్, మహ్మద్ ముస్తాఖ్, అలియాస్ సల్మాన్, సయ్యద్ సలావుద్దీన్ అలియాస్ అమ్ము అరెస్టయ్యారు. ఈ ముఠాలోని సభ్యులందరిపై గతంలోనూ కేసులున్నాయి. చోరీకి గురైన సెల్ఫోన్లను హైదరాబాద్లోని పలుచోట్ల సెల్ఫోన్ దుకాణదారులు తక్కువ ధరకు కొంటున్నారు.
వారిలో షేక్ షాహబాజ్ఖాన్, మహ్మద్ ఆసిఫ్ అహ్మద్, మహ్మద్ గౌస్, మహ్మద్ అర్షద్మొహినుద్దీన్, మహ్మద్ నవీద్ ఉద్దీన్ సలీమ్, మహ్మద్ నజీరుద్దీన్, మహవీర్ జైన్, మహ్మద్ అబ్దుల్ సిరాజ్, మజీద్ఖాన్, అబ్దుల్ హజీమ్, షేక్ జావెద్ ఉన్నారు. ఐఎంఈఐ నంబర్లను ట్యాంపర్ చేసే సెల్ఫోన్ టెక్నీషియన్స్గా సయ్యద్ రహీమ్, మహ్మద్ అర్బాజ్ ఖాన్, నీజాముద్దీన్, ఖాన్ సాదిక్ అహ్మద్ ఉన్నారు. ఈ టెక్నీషియన్లు అబిడ్స్లోని జగదీశ్ మార్కెట్లో ఎక్కువగా ఉన్నారు. ఫోన్లను అన్లాక్ చేయడం, అంతర్జాతీయ మార్కెట్లో ఏమి ఉపయోగపడుతాయి, ఏమి ఉపయోగపడవు అనేది గుర్తించి వాటిని అక్కడే వేరు చేస్తుంటారు.
సూడాన్కు తరలింపు
చోరీ చేసి వాటిలో కొన్నింటిని ఐఎంఈఐ నంబర్ను ట్యాంపరింగ్ చేసి బిజినెస్ వీసాపై హైదరాబాద్కు వచ్చి నానల్నగర్లో నివాసముంటున్న సూడాన్ దేశానికి చెందిన మహ్మద్ ముసా హస్సాన్ గామ్రాల్నాబియకు విక్రయిస్తుంటారు. ఆయా ముఠాల నుంచి పలు దఫాలుగా సెల్ఫోన్లు కొంటూ తన ఇంట్లో దాచిపెట్టి వాటిని అక్రమంగా సముద్రమార్గాన సూడాన్ దేశానికి తరలిస్తాడు. అక్కడ వాటిని మార్కెట్ ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఈ ముఠా నుంచి యాపిల్ ఐఫోన్, సామ్సాంగ్, వివో, రెడ్మి, రియల్ మీ, వన్ ప్లస్, ఒప్పొ, పొకొ తదితర కంపెనీల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తును అదనపు డీసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలోని ఇన్స్పెక్టర్లు షేక్ జకీర్ హుస్సేన్, వెంకట్రెడ్డి, నాగార్జున బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.