బోయినపల్లి, జనవరి 1: తలకు బలమైన గాయమై కోమాలోకి వెళ్లి దవాఖానలో చికిత్స పొందుతూ సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ జవాన్ మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లిలో సోమవారం జరిగింది. చాడ శివకుమార్(26) రెండేండ్ల క్రితం సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) విభాగంలో కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం రాజస్థాన్లోని 16వ బెటాలియన్ డిలోలీలో డాక్యుమెంటరీ సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలోనూ అర్హత సాధించగా.. ట్రైనింగ్ సమయం కావడంతో తిరిగివెళ్లాడు. గతేడాది దసరా పండుగకు ఇంటికొచ్చిన శివకుమార్.. తిరిగి విధుల్లో చేరాడు. ఈ క్రమంలో గత డిసెంబర్ 16న ప్రమాదవశాత్తు కిందపడి తలకు బలమైన గాయమై కోమాలోకి వెళ్లాడు. అధికారులు దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా.. సోమవారం మృతి చెందాడని కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.