హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మూడు నెలల నుంచి జాతుల వైరంతో రగిలిపోతుంటే పార్లమెంటులో నాయకులు నువ్వా నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారంపై మాట్లాడలేదని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. జోకర్ను నాయకుడిని చేస్తే మనం చూసేది ఇలాంటి సర్కస్ మాత్రమే అని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘సమూహ’ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆవిర్భావ సభను ఆయన ప్రారంభించారు. కవులు, రచయితలతో కలిసి ‘సమూహ’ లోగోను ఆవిష్కరించారు. ‘లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం రచయితలు అందరూ సంఘటితమైనదే ఈ సమూహ. ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచయితలందరి ఉమ్మడి స్వరమే ఈ సమూహ. సహనశీలతను పాటిస్తూ మతోన్మాదాన్ని ధిక్కరించే సాహిత్యకారులు, సాంస్కృతిక కార్యకర్తల ఉమ్మడి వేదిక ఈ సమూహ’ అని ప్రకాశ్ రాజ్ అన్నారు.
‘శరీరానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే కొన్నాళ్లకు తగ్గుతాయి కానీ, దేశానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే తగ్గవు. ప్రస్తుతం మనం, మన దేశం అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ తాను ఊరికే కూర్చోలేనన్నారు. మణిపూర్ రగిలిపోతుంటే పార్లమెంటులో సమస్య పరిష్కారంపై చర్చించాల్సింది పోయి, నాయకులు గొప్పలకు పోయారన్నారు. జోకర్ నాయకుడైతే మనం సర్కస్ చూడాల్సిందేనని వ్యాఖ్యానించారు.