హైదరాబాద్, జూన్ 22: శ్రీలంకలో అదానీ క ంపెనీకి పోటీ లేకుండా పవర్ ప్లాంటు కాంట్రాక్టు కట్టబెట్టేలా మోదీ సర్కారు ఒత్తిడి తెచ్చిందని తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నా.. ఇప్పటికీ బీజేపీ సర్కారు అదే వైఖరి అవలంబిస్తున్నది. తమకు సన్నిహితులైన కార్పొరేట్లకు ప్రయోజనం కల్పించేలా నిబంధనలు మారుస్తూనే ఉన్నది. రష్యా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి బొగ్గు దిగుమతులకు ప్రభుత్వాల స్థాయి ఒప్పందాల విషయంలో మోదీ సర్కారు తీరును మరోసారి బయట పెట్టింది. ఈ దేశాలతో ప్రభుత్వాల స్థాయిలో ఒప్పందాలు కుదిరితే మనకు తక్కువ రేటుకే బొగ్గు లభిస్తుంది. కానీ, అలాంటి ఒప్పందాలు చేసుకొనేందుకు మోదీ సర్కారు ఆసక్తి చూపట్లేదని సమాచారం.
ప్రైవేటుకు సీఐఎల్ కాంట్రాక్టులు
ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు లేకపోవటంతో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) ప్రైవేటు కంపెనీల నుంచి అధిక ధరలకు బొగ్గు కొంటున్నది. ఇప్పటికే 6 మిలియన్ టన్నుల బొగ్గు కోసం టెండర్లు పిలిచింది. ఇందులో సగం వరకు ప్రైవేటు కంపెనీల నుంచే తీసుకొంటున్నది. ఆ కంపెనీల్లో సహజంగానే ప్రధాని మోదీ సన్నిహితుడైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా ఉన్నది. దేశంలో బొగ్గు కొరత తీవ్రం కావటంతో విదేశాల నుంచి తప్పనిసరిగా బొగ్గును దిగుమతి చేసుకోవాలని అన్ని రాష్ర్టాల విద్యుత్తు ఉత్పత్తి సంస్థలను కేంద్రం ఆదేశించింది. ఒక్కో సంస్థ వినియోగించే మొత్తం బొగ్గులో కనీసం పది శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని షరతు విధించింది. మన దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం కారణంగా బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయాన్ని సాకుగా చూపుతూ ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ 11ను వాడుకొని కంపెనీలన్నీ విధిగా విదేశీ బొగ్గు కొనాలని ఆదేశాలిచ్చింది.
తక్కువ రేటుకు దొరికే అవకాశం ఉన్నా..
భారత ప్రభుత్వం చొరవ చూపితే రష్యా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు డిస్కౌంట్ రేటుకు బొగ్గు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని వదులుకొని ప్రైవేటు కంపెనీల వద్దే బొగ్గు కొనేందుకు సీఐఎల్ ఆసక్తి చూపుతుండటం గమనార్హం. ఇటీవలే 11 ప్రైవేటు బొగ్గు సరఫరా కంపెనీలతో ప్రీ బిడ్డింగ్ సమావేశం నిర్వహించినట్టు మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఈ సమావేశానికి హాజరైనవాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, మోహిత్ మినరల్స్, చెట్టినాడ్ లాజిస్టిక్స్ తదితర సంస్థలు ఉన్నాయి. ఆ కంపెనీల కోరిక మేరకు బిడ్డింగ్ ప్రైజ్ కాల వ్యవధిని 90 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించినట్టు సీఐఎల్ అధికారులు తెలిపారు. బొగ్గు సైప్లె విషయంలో కూడా ప్రైవేటు కంపెనీలకు ప్రయోజనం కలిగేలా సీఐఎల్ పలు మార్పులు చేసింది. సరఫరా ఆర్డర్ లేఖ అందిన నాలుగు నుంచి ఆరు వారాల్లోపు బొగ్గు సరఫరా చేయాలని కొత్త నిబంధన పెట్టింది. ఇది అదానీ వంటి అతికొద్ది కంపెనీలకే లాభం చేకూరుస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో కూడా కొన్ని కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు మార్చారు. కొన్ని ప్రైవేటు సంస్థలకు నిరంతరం టెండర్లు లభించేలా ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న టెండర్లన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర విద్యుత్తు శాఖ అన్ని రాష్ర్టాలకు ఆదేశాలిచ్చింది.