హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): మార్గదర్శి కేసులో బ్రహ్మయ్య అండ్ కో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు తనిఖీలు, డాక్యుమెంట్లపై స్టేటస్ కో (యధాతథస్థితి) విధిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 31వ తేదీకి వాయిదా వేసింది.
తమ సంస్థలో తనిఖీలు చేపట్టడం, ఉద్యోగులను, భాగస్వాములను నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ బ్రహ్మయ్య అండ్ కో పెద్ది చంద్రమౌళి దాఖలు చేసిన అత్యవసర లంచ్మోషన్ పిటిషన్ను రాత్రి 7 గంటల సమయంలో జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది నళిన్కుమార్ వాదించారు. ఏపీ సర్కార్ తరపున స్పెషల్ కౌన్సిల్ పీ గోవింద్రెడ్డి వాదించారు. 1979 సీఆర్పీసీ సెక్షన్ 165, 166 కింద లోకల్ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకొని తనిఖీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తనిఖీల ప్రక్రియ పూర్తి అయ్యిందని, పత్రాలు, సామగ్రి నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించినట్టు చెప్పారు.