హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ పాస్పోర్టు (Fake Passport) కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫేక్ పాస్పోర్టుతో 92 మంది దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు వారికోసం లుకౌట్ నోటీసులు (Look Out Notice) జారీ చేశారు. వారి వివరాలను విదేశాంగ శాఖకు పంపించారు. ఆ 92 మందిని వెనక్కి రప్పించి విచారించాలని భావిస్తున్న అధికారులు.. వారి పాస్పోర్టులను రద్దు చేయాలని రీజినల్ పాస్పోర్టు ఆఫీస్కు సీఐడీ లేఖ రాసింది.
ఒకే ఆధార్ నంబర్తో అనేక చిరునామాలు, ఫేక్ పత్రాలు సృష్టించి 92 మంది పాస్పోర్టులను పొందారు. విజిటింగ్ వీసాలతో థాయిలాండ్, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ వెళ్లిపోయారు. ఈ కుంభకోణంలో ఏజెంట్లు, పాస్పోర్టు సిబ్బంది, ఎస్బీ సిబ్బంది కుమ్మక్కయినట్టు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. జగిత్యాలతోపాటు ఫలక్నుమా చిరునామాలతో నకిలీ పాస్పోర్టులు ఎక్కువగా పొందినట్లు గుర్తించారు. కాగా, మిగిలినవారైనా ఇతర దేశాలకు పారిపోకుండా సీఐడీ చర్యలు తీసుకుంటున్నారు.