హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కేంద్రం చేపడుతున్న కులగణనలో బీసీకులాలకు ప్రత్యేకమైన యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ (బీసీఐఎఫ్) చైర్మన్ చిరంజీవులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణన అంశంపై ప్రజలకు పలు వివరాలు వెల్లడించేందుకు ఫోరం, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ డాక్టర్ యోగేంద్రయాదవ్ పాల్గొని కులగణనలో ఎదురవుతున్న సమస్యలు, శాస్త్రీయ కులగణన ఆవశ్యకతను వివరిస్తారని వెల్లడించారు. కులగణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించి, ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించి, డాటాను ప్రభుత్వం రూపొందించాలని డిమాండ్ చేశారు.