బేగంపేట్ ఫిబ్రవరి 4 : క్యాన్సర్ వ్యాధి అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదు.. అది మన జీవన విధానంతో మనలో మొదలవుతున్నదని పద్మవిభూషణ్, ప్రముఖ సినీ హీరో చిరంజీవి అన్నారు. బుధవారం సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన ఆడిటోరియంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ క్యాన్సర్ అనగానే జీవితం ముగిసినట్టే అనుకుంటున్నారని, కానీ ఎంతోమంది క్యాన్సర్ను జయించారని గుర్తుచేశారు. మన జీవనశైలి కారణంగానే వ్యాధులు వస్తాయని, అందుకే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అని అన్నారు. ముందుగా క్యాన్సర్ను గుర్తిస్తే దాన్ని జయించి సాధారణ జీవితాన్ని ఆస్వాదించొచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మధు దేవరశెట్టి మాట్లాడుతూ గతంలో యాభై ఏండ్ల పైబడిన వారికి క్యాన్సర్ వచ్చేదని, ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి జన్యుపరమైన లోపాలు, వంశపారంపర్యం, రేడియేషన్, రసాయన పదార్థాలు, ఎరువులు వాడకం, మద్యం, ధూమపానం, ఒత్తిడి, డయాబెటిస్ ఇలా అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. అనంతరం క్యాన్సర్ను జయించిన కొంతమంది పిల్లలు వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ సీఎండి డాక్టర్ భాస్కర్రావు, వైద్యులు సంబిత్సాహూ, నరేందర్కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.