Chirag Paswan | బిహార్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీని ప్రశంసించిన నాటి నుంచి రాజకీయాలు వేడెక్కాయి. మోదీని ప్రశంసించిన నేపథ్యంలో ఆయన బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. అయితే, జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలోని అంతర్గత కలహాలను ఆర్జేడీ కొట్టిపారేస్తుండగా.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. బీహార్ సంక్షేమం కోసం తిరుగుబాటును అనుమతించబోమని ఆర్జేడీ స్పష్టం చేసింది.
ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను లోక్జనశక్తి పార్టీ (రాంవిలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షాతో బిహార్ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తున్నది. భేటీ అనంతరం చిరాగ్ పాశ్వాన్ విలేకరులతో మాట్లాడారు. బిహార్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. ఈ విషయంపై అమిత్షా, జేపీనడ్డాలను కలిసినట్లు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులను ఆయన ముందుంచానన్నారు. పొత్తులపై స్పందిస్తూ.. పరిస్థితి చాలా సానుకూలంగా ఉందని, రాబోయే రోజుల్లో అందరికీ తెలిసిపోతుందన్నారు.
గత నాలుగు రోజులుగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు కోసం చర్చల ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, నితీశ్ కుమార్ ఇవాళే సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో నితీశ్ సైతం కీలక నేత కాగా.. బీజేపీతో పొత్తు వార్తలను కూటమి కొట్టిపడేస్తున్నది. మరో వైపు కూటమిలో పలు పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు ప్రకటించాయి. తృణమూల్ కాంగ్రెస్, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీలో ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.