హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆలయాల అభివృద్ధికి, అర్చకుల సంక్షేమానికి విశేషంగా కృషిచేస్తున్నారని త్రిదండి చినజీయర్స్వామి కొనియాడారు. ధూపదీప నైవేద్యంలో భాగంగా అర్చకులకు ప్రతినెలా గౌరవ వేతనాలు ఇవ్వడంవల్ల ఆలయాల్లో ఆటంకం లేకుండా నిత్యం పూజలు జరుగుతున్నాయని చెప్పారు. దీనివల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని పేర్కొన్నారు. బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో రూపొందించిన ప్లవనామ నూతన సంవత్సర పంచాంగాన్ని శనివారం తన ఆశ్రమంలో ఆవిష్కరించారు. 13న నూతన సంవత్సర వేడుకను వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉగాది, శ్రీరామనవమిని సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవాసమితి గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు, కన్వీనర్ వల్లూరి పవన్కుమార్, కార్యదర్శి రాఘవాచార్యులు, తెలంగాణ అర్చక సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు టీ రాజేశ్వర్శర్మ తదితరులు పాల్గొన్నారు.